హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 25 (నమస్తే తెలంగాణ): భారత్లో అడ్డగోలుగా నకిలీ బ్యాంకు ఖాతాలు తెరిచి పార్ట్టైమ్ ఉద్యోగాలు, పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతూ చైనాలోని సైబర్ నేరగాళ్లకు వెన్నుదన్నుగా నిలుస్తున్న అహ్మదాబాద్ (గుజరాత్) వాసి ప్రకాశ్ ప్రజాపతి పలుమార్లు దుబాయ్, చైనాకు వెళ్లివచ్చినట్టు పోలీసులు గుర్తించారు. అతని నుంచి స్వాధీనం చేసుకున్న రెండు ఫోన్లలో ఒకదాని నుంచి సేకరించిన సమాచారంతో రూ.712 కోట్ల స్కామ్ను వెలుగులోకి తెచ్చి, ఇప్పటికే 9 మందిని అరెస్టు చేశారు. మరో ఫోన్లోని మొత్తం డాటా ఇప్పటికే డిలీట్ అయింది.
ప్రస్తుతం ఈ ఫోన్లు స్విచ్చాఫ్ కావడంతో అనుమానించిన విదేశాల్లోని ప్రజాపతి అనుచరులు అతని జీమెయిల్ ఖాతాను ఉపయోగించి ఫోన్లోని డాటాను డిలీట్ చేసినట్టు తెలుస్తున్నది. అయినప్పటికీ ఆ డాటాను కూడా వెలికితీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇది విజయవంతమైతే చైనా, దుబాయ్లోని ఈ ముఠా సభ్యుల కీలక సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశమున్నది.
ఉలిక్కిపడిన కేంద్ర దర్యాప్తు సంస్థలు
భారత్లో ఎంతో మంది అమాయకుల నుంచి దోచుకున్న సొమ్మును ప్రజాపతి ముఠా సభ్యులు క్రిప్టో కరెన్సీ రూపంలో విదేశాలకు తరలించడంతోపాటు ఉగ్రవాదులకు కూడా ఫండింగ్ చేస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది. దీంతో ఉలిక్కిపడిన కేంద్ర దర్యాప్తు సంస్థలు.. ఈ కేసుపై ప్రత్యేకంగా దృష్టి సారించాయి. దీనిలో భాగంగా సోమవారం సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసుల నుంచి కొన్ని వివరాలను సేకరించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు.. మంగళవారం మరింత సమాచారాన్ని సేకరించారు. ఈడీతోపాటు ఎన్ఐఏ, ఐబీ, సీఐ సెల్ అధికారులు కూడా సైబర్క్రైమ్ పోలీసుల నుంచి వివరాలు సేకరించారు.