హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): తమిళనాడు, తెలంగాణలోని 31 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శనివారం సోదాలు చేపట్టింది. కోయంబత్తూరులో 22, చెన్నైలో 3, టెకాసీలోని ఓ ప్రాంతంతోపాటు హైదరాబాద్లోని 5 ప్రాంతాల్లో జరిగిన ఈ సోదాల్లో రూ.60 లక్షల నగదు, 18,200 అమెరికన్ డాలర్లతోపాటు పలు కీలక పత్రాలు, మొబైళ్లు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. కోయంబత్తూరులో నిరుడు అక్టోబర్లో జరిగిన కారు బాంబు దాడిపై ఎన్ఐఏ దర్యాప్తు జరుపుతున్న విషయం తెలిసిందే. ఐసిస్ సానుభూతిపరులు ముఠాగా ఏర్పడి, అమాయకులైన యువకులను ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు ప్రయత్నిస్తుట్టు ఆ దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ పాతబస్తీ, మలక్పేట, టోలీచౌకీ, శాస్త్రిపురం తదితర ప్రాంతాల్లో ఐసిస్ సానుభూతిపరులుగా అనుమానిస్తున్న వారి నివాసాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో పలు కీలక పత్రాలు, నగదు, ఫోన్లు, పలు ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.