నాగర్కర్నూల్/ హైదరాబాద్ : నాగర్కర్నూల్లో జరిగిన కుల వివక్ష ( Caste Discrimination ) దాడి , పోలీసుల నిర్లక్ష్యంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సీరియస్ అయ్యింది. ఘటనపై నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది.
న్యాయవాది వినోద్ హిందుస్థానీ( Vinod Hindustani ) దాఖలు చేసిన ఫిర్యాదుపై స్పందిం చిన కమిషన్, నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్, ఎస్పీకి నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై తీసుకున్న చర్యల నివేదికను (ATR) నాలుగు వారాల్లోగా సమర్పించాలని ఆదేశించింది.
ఈనెల 18న కుమ్మెర మల్లన్న స్వామి జాతర సందర్భంగా చిలుకేశ్వరం చంద్రకళ కుటుంబాన్ని ఆలయంలోకి ప్రవేశాన్ని నిరాకరించడంతో పాటు రెండు నెలల పసికందును ఉద్దేశపూర్వకంగా తొక్కడంతో ఆ శిశువు మరణించింది. నిందితులపై చర్యలు తీసుకోవాల్సిన చర్యలపై పోలీసులు నిర్లక్ష్యం వహించడాన్ని తప్పుపడుతూ న్యాయవాది కమిషన్కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

బాధితులు నాగర్కర్నూల్ పోలీసు స్టేషన్కు వెళ్లినప్పుడు, నిందితులకు ఉన్న రాజకీయ పలుకుబడి కారణంగా ఎఫ్.ఐ.ఆర్ (FIR) నమోదు చేయడానికి అధికారులు నిరాకరించారని ఆరోపించారు. పోలీసులు రాజ్యాంగ రక్షణలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను సైతం ఉల్లంఘించారని కమిషన్ గుర్తించిందన్నారు.
నిందితులను అరెస్టు చేయడం, విధి నిర్వహణలో విఫలమైన పోలీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, బాధితులకు రక్షణతో పాటు పరిహారం అందించాలని కమిషన్ పేర్కొందని వివరించారు.. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు న్యాయం జరిగే ప్రక్రియలో రాజకీయ పలుకుబడి అడ్డంకి కాకూడదని నిర్ధారించడానికి కమిషన్ జోక్యం ఒక కీలక ముందడుగు అన్ని వినోద్ హిందుస్థానీ పేర్కొన్నారు.