Telangana | హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): నెమ్మదిగా నడవడంలో నత్తకు మరే ప్రాణీ సాటిరాదంటారు. కానీ, జాతీయ రహదారుల శాఖ పనితీరును చూసి ఇప్పుడు నత్త సైతం సిగ్గు పడుతున్నది. తెలంగాణలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ (ఎంవోఆర్టీఏహెచ్) ఆధ్వర్యంలో చేపట్టిన పలు రోడ్ల అభివృద్ధి పనులు నత్త కంటే నిదానంగా సాగుతుండటమే ఇందుకు కారణం. వీటిలో ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్, భద్రాచలం వద్ద గోదావరి నదిపై వంతెన, నిర్మల్-ఖానాపూర్, దుద్దెడ-జనగామ రోడ్లు ప్రధానమైనవి. రకరకాల వింత కారణాలను చెప్తూ ఏండ్ల తరబడి ఈ పనులను సాగదీస్తున్నారు. ఈ జాప్యానికి బాధ్యులైనవారిపై చర్యలు చేపట్టేందుకు ఎన్హెచ్ఏఐ అధికారులు ససేమిరా అంటున్నారు.
గోదావరిపై ఎనిమిదేండ్లయినా పూర్తికాని వంతెన
గోదావరి నదిపై భద్రాచలం వద్ద నిర్మిస్తున్న వంతెన ఎనిమిదేండ్లయినా ఇంకా అందుబాటులోకి రాలేదు. గోదావరిపై 55 ఏండ్ల క్రితం నిర్మించిన బ్రిడ్జి ప్రస్తుత ట్రాఫిక్ అవసరాలకు చాలకపోవడంతో దానికి సమాంతరంగా 12 మీటర్ల వెడల్పు, 1.20 కి.మీ. పొడవైన వంతెన నిర్మాణానికి 2015 ఏప్రిల్లో శంకుస్థాపన చేశారు. రెండేండ్లలో పూర్తికావాల్సిన ఈ పనులు 8 ఏండ్లయినా పూర్తికాలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల అనుసంధానానికి ఉపయోగపడే ఈ వంతెన నిర్మాణంలో జాప్యంపై అధికారులు మెమో ఇచ్చినప్పుడల్లా కాంట్రాక్టర్ హడావుడిగా నెల రోజులు పనులు నిర్వహించి మళ్లీ మాయమవుతున్నారు. గోదావరి వరదలు, కరోనా తదితర కారణాలతో వర్క్ ఏజెన్సీ ప్రతినిధులు ఈ పనులను ముందుకు సాగనివ్వడంలేదు. అయినా సదరు కాంట్రాక్టర్ జాతీయ రహదారుల శాఖ ఐదుసార్లు ఎక్స్టెన్షన్ ఇవ్వడం గమనార్హం. మహారాష్ట్రకు చెందిన ఈ కాంట్రాక్టరు జాతీయ రహదారుల శాఖ మంత్రికి అత్యంత సన్నిహితుడు కావడంతోనే అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా వెంటనే ఆ కాంట్రాక్టర్ను తొలగించి పనులను మరో కాంట్రాక్టర్కు అప్పగించాలని రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ సిఫారసు చేసినా కేంద్రం మెతక వైఖరిని అవలంబిస్తున్నది.
నిస్సహాయ స్థితిలో రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ
ఎంఓఆర్టీఏహెచ్ చేపడుతున్న రోడ్డు ప్రాజక్టుల పర్యవేక్షణ బాధ్యతలను రాష్ట్ర ఆర్అండ్బీ శాఖకు అప్పగించడం ఆనవాయితీగా వస్తున్నది. టెండర్ల ప్రక్రియ, తనిఖీలు, నాణ్యతా పరీక్షలు, బిల్లుల చెల్లింపులు తదితర వ్యవహారాలన్నీ జాతీయ రహదారుల శాఖ అధికారులే చూస్తారు. భూసేకరణ, యుటిలిటీ షిఫ్టింగ్ పనులు, ప్రాజెక్టుల పురోగతిని మాత్రమే రాష్ట్ర ఆర్అండ్బీ అధికారులు పర్యవేక్షిస్తారు. సంబంధిత కాంట్రాక్టర్లను కొనసాగించడం, తొలగించడం, మార్చడం లాంటి అధికారాలన్నీ కేంద్రానికే ఉంటాయి. దీంతో పైన పేర్కొన్న పనుల జాప్యానికి కారకులైన కాంట్రాక్టర్లపై రాష్ట్ర ఆర్అండ్బీ అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోలేని పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో గోదావరి బ్రిడ్జి, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్, నిర్మల్-ఖానాపూర్ రోడ్డు, దుద్దెడ-జనగామ రోడ్డు తదితర ప్రాజక్టుల కాంట్రాక్టర్లను మార్చాలని, పనులను త్వరగా పూర్తిచేయాలని, పర్యావరణ అనుమతులు వెంటనే మంజూరు చేయాలని రాష్ట్ర ఆర్అండ్బీ అధికారులు ఇప్పటికే ఎన్నోసార్లు లేఖలు రాసినా కేంద్రం స్పందించడం లేదు.
పర్యావరణ అనుమతుల్లో తీవ్ర జాప్యం
నిర్మల్-ఖానాపూర్ మధ్య ఎన్హెచ్-61 రోడ్డును నాలుగు లేన్లకు విస్తరించేందుకు రూ.141 కోట్ల వ్యయంతో 2020లో పనులు చేపట్టారు. అడవి మధ్య నుంచి సాగే ఈ రోడ్డుకు ఇరువైపులా భారీ వృక్షాలు ఉండటంతో వాటిని తొలగించేందుకు, భూసేకరణకు కేంద్ర పర్యావరణ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ, ఈ రోడ్డు విస్తరణకు దాదాపు 3 వేల చెట్లను తొలగించడంతోపాటు 17.4 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంటుందని, దీని వల్ల వన్యప్రాణులకు నష్టం జరుగుతుందని పర్యావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీంతో కేంద్రం నుంచి అనుమతులు రాకపోవడం వల్ల ఈ రోడ్డు విస్తరణ పనులు నాలుగేండ్లయినా ముందుకు సాగడం లేదు.
ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్కు మోక్షమెప్పుడో?
హైదరాబాద్-వరంగల్ రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు 2018లో ఉప్పల్ జంక్షన్ నుంచి మేడిపల్లిలోని సెంట్రల్ పవర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మూడేండ్లలో (2021 నాటికే) పూర్తికావాల్సిన ఈ పనులు ఇంతవరకు పూర్తికాలేదు. భూసేకరణ పేరుతో తొలి రెండేండ్లు పనులు చేపట్టని ఎన్హెచ్ అధికారులు.. ఆ తర్వాత కరోనా, వర్షాలు అంటూ మరికొంత కాలాన్ని వెళ్లదీశారు. రూ.675 కోట్లతో 45 మీటర్ల వెడల్పు, 6.2 కి.మీ. పొడవున నిర్మిస్తున్న ఈ కారిడార్ హైదరాబాద్లోని పీవీ నర్సింహారావు ఎక్స్ప్రెస్వే కారిడార్ (11.6 కి.మీ.) తర్వాత రెండవ అతి పొడవైన ఎలివేటెడ్ కారిడార్ కావడం విశేషం.