సాలుమారద తిమ్మక్క నేషనల్ గ్రీన్అవార్డ్ ప్రదానం
వృక్షమాత తిమ్మక్క నుంచి అవార్డు అందుకున్న ఎంపీ
హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): ప్రకృతి ప్రేమికుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు సంతోష్ను సాలుమారద తిమ్మక్క నేషనల్ గ్రీన్అవార్డ్ వరించింది. తిమ్మక్క ఇంటర్నేషనల్ ఫౌండేషన్, సిద్దార్థ ఎడ్యుకేషనల్ సొసైటీ-కర్ణాటక సంయుక్తంగా 2020 ఏడాదికి దేశంలో అత్యుత్తమ సామాజిక సేవకుకు అందిస్తున్న అవార్డుల్లో ప్రకృతి పరిరక్షణ విభాగంలో సంతోష్ను ఎంపికచేశారు. తిమ్మక్మ 111వ జన్మదినాన్ని పురస్కరించుకొని బెంగళూరులోని వసంత్నగర్ అంబేద్కర్ స్టేడియంలో గురువారం తిమ్మక్క చేతుల మీదుగా సంతోష్ అవార్డు అందుకొన్నారు. అనంతరం ఎంపీ సంతోష్ మాట్లాడుతూ ఈ అవార్డుకు తనను ఎంపిక చేయడం పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ స్ఫూర్తితో తనవంతుగా ప్రకృతికి ఏదైనా చేయాలనే సంకల్పంతో ఐదేండ్ల కిందట ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’కు రూపకల్పన చేశామని చెప్పారు. ఒకరు మొక్కనాటి మరొకరిని ప్రోత్సహించడమే ఉద్దేశంగా చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ ఖండాలు దాటిందని పేర్కొన్నారు. తనతోపాటు అవార్డు అందుకొన్న ఇస్రో మాజీ చైర్మన్ పద్మశ్రీ పురస్కార గ్రహీత ఏఎస్ కిరణ్కుమార్, నిర్మాత రంగనాథ్ భరద్వాజ్, రచయిత గురురాజా కరజ్జయిని, సత్యామోర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం గంగాధరయ్య పరమేశ్వర్, సిద్దార్థ మఠం పీఠాధిపతి హోరనవెళ్లి సద్గురు శంకరానంద మహాస్వామి తదితరులు పాల్గొన్నారు.