హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): రానున్న ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు మేడారం జాతర జరుగనున్న నేపథ్యంలో జాతీయ హోదా అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో రెండేండ్లకు ఒకసారి జరిగే మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటినుంచో కేంద్రాన్ని కోరుతున్నది. గతంలో కేంద్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి అర్జున్ముండా జాతీయ హోదా కల్పించేందుకు కృషి చేస్తానని సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న సందర్భంగా హామీ ఇచ్చినప్పటికీ అది కలగానే మిగిలిపోయింది. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రస్తుతం రాష్ర్టానికి చెందిన మంత్రి జీ కిషన్రెడ్డి చేతిలోనే ఉన్నది. జాతీయ హోదా సాధనలో ఆయన ఏ మేరకు చొరవ చూపుతారనే ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతున్నది. ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరకు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఈశాన్య రాష్ర్టాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు.
స్వరాష్ట్రంలో భారీగా నిధుల కేటాయింపు
అనేక పోరాటాల ఫలితంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1998లో స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించినప్పటికీ, నిధుల విషయంలో నిర్లప్తతనే ప్రదర్శించింది. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఏటా భారీ ఎత్తున నిధులు విడుదల చేస్తూ, సమ్మక్క-సారలమ్మను దర్శించుకొనే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూస్తున్నారు. స్వరాష్ట్రంలో ఇప్పటివరకు నాలుగుసార్లు మేడారం జాతర జరగగా రాష్ట్ర ప్రభు త్వం మొత్తం 332.71 కోట్లు కేటాయించడం విశేషం. మునుపెన్నడూలేని విధంగా ఈ ఏడాది జాతరకు నాలు గు నెలల ముందే రూ.75 కోట్లు విడుదల చేశారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ ద్వారా కేంద్ర గిరిజన సంక్షేమశాఖతోపాటు ఆయా రాష్ర్టాలకు ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపి, సముచిత గౌరవం కల్పిస్తున్నారు. జాతర ప్రాముఖ్యం, నేపథ్యం, భక్తుల రాక మొదలైన అంశాలను పరిగణనలోనికి తీసుకొని మేడారం జాతరకు జాతీయ హోదా (నేషనల్ ఫెస్టివల్) కల్పించాలని 2016 నుంచి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిస్తూనే ఉన్నది. 2016లో అప్పటి గిరిజన సంక్షేమశాఖ మంత్రి ఆజ్మీరా చందూలాల్ కేంద్రానికి లేఖ రాశారు. ప్రస్తుత గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్, ఎంపీ మాలోతు కవిత, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలోని ప్రత్యేక బృందం కేంద్ర మంత్రిని కలిసి నివేదించారు. గత జూన్ 24న కూడా మేడారం జాతరకు జాతీ య హోదా విషయంలో కేంద్రం ప్రత్యేక చొరవ చూపాలని రాష్ట్ర ప్రభుత్వం విన్నవించింది. మేడారం జాతరపై సంపూర్ణ అవగాహన ఉన్న కిషన్రెడ్డి సారథ్యంలోని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ నుంచి ఇప్పటివరకు సానుకూల స్పందన రాకపోవడం గమనార్హం.