హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): అడవుల్లో అగ్నిప్రమాదాల నివారణకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖతో కలిసి దేశవ్యాప్తంగా ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్ఎండీఏ) నిర్ణయించింది. ప్రణాళిక రూపకల్పనలో భాగంగా ప్రతిపాదనలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ప్రతి రాష్ట్రం నుంచి రెండు లేదా మూడు జిల్లాల్లో అగ్నిప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై డీపీఆర్లు అందజేయాలని కోరింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ రూ.66.88 కోట్ల అంచనాతో ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలను గుర్తించి, ఇప్పటికే ప్రతిపాదనలు పంపింది.
26 జిల్లాల్లో అగ్నిమాపక నిర్వహణ బలోపేతమే లక్ష్యం
దేశంలో అత్యధికంగా అటవీ అగ్ని ప్రమాదాలు జరిగే 26 జిల్లాల్లో అటవీ అగ్నిమాపక నిర్వహణను బలోపేతం చేయడంపై ఎన్ఎండీఏ దృష్టి సారించింది. ఈ మేరకు పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖల సహకారంతో ‘ఫారెస్ట్ ఫైర్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా’పై ఎన్ఎండీఏ ఇటీవల వర్క్షాప్ కూడా నిర్వహించింది. దీనిలో ఎకువగా అటవీ అగ్నిప్రమాదాలు సంభవిస్తున్న 11 రాష్ట్రాల్లో భవిష్యత్తులో ప్రమాదాలను నివారించడం, ఈ విపత్తుల పట్ల వేగంగా స్పందించడంపై దృష్టి సారించింది. ఎంహెచ్ఏ, ఎన్డీఎంఏ, ఐఏఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఎఫ్ఎస్ఐ, ఐసీఎఫ్ఆర్ఈ, ఐజీఎన్ఎఫ్ఏతో పాటు 11 రాష్ర్టాల అటవీ శాఖలకు చెందిన వివిధ స్థాయిల అధికారులకు అటవీ అగ్ని శిక్షణ, అగ్ని హెచ్చరికలు, ముందస్తు హెచ్చరికలపై అవగాహన కల్పించారు.
ఫారెస్ట్ మేనేజ్మెంట్ అంచనా, సమస్యలు, సవాళ్లు, అటవీ అగ్ని నిర్వహణపై గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్, కెపాసిటీ, ట్రైనింగ్ పరిమితులపై అవగాహన కల్పించారు. విపత్తు ప్రమాదాన్ని తగ్గించడం, స్థానిక సమాజ ప్రమేయం, విపత్తు ప్రభావం తగ్గింపు కోసం సోషల్ మీడియాను ఉపయోగించడంపై అవగాహన కల్పించారు. 26 జిల్లాల డివిజనల్ ఫారెస్ట్ అధికారులతో చర్చలు కూడా జరిపారు. 2023 మార్చి, ఏప్రిల్ నెలల్లో దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను క్రోడీకరించి అగ్నిప్రమాదాల నివారణకు తుది ప్రణాళికను ఖరారు చేస్తారని అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు.