రాజ్యాంగ సమీక్షకు కమిషన్ వేసిన వాజపేయి
ప్రస్తుత రాజ్యాంగం మార్చాలన్నదే బీజేపీ టార్గెట్
రాజ్యాంగ మౌలిక లక్ష్యాలు గిట్టని కాషాయ పార్టీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: అది 2000 ఫిబ్రవరి 22. వాజపేయి నేతృత్వంలో అప్పటి ఎన్డీయే ప్రభుత్వం రాజ్యాంగ సమీక్షకు జస్టిస్ వేంకటాచలయ్య నేతృత్వంలో జాతీయ కమిషన్ ఏర్పాటు చేసింది. దీని లక్ష్యం రాజ్యాంగాన్ని సమీక్షించడం. యాభై ఏండ్లలో గడించిన అనుభవాల వెలుగులో సమీక్ష జరుపుతున్నట్టు కమిషన్ విధుల్లో పేర్కొన్నారు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా పరిపాలనను సాఫీగా, సమర్థవంతంగా సాగించడం, సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం ఈ కమిషన్ సూచనలు చేస్తుందని కేంద్రం పేర్కొన్నది. అయితే పార్లమెంటరీ ప్రజాస్వామ్య పరిధిలోనే మార్పులు ఉంటాయని పేర్కొన్నది. రాజ్యాంగ మౌలిక లక్ష్యాలలో మార్పు ఉండదని స్పష్టం చేసింది. ఈ కమిషన్ 2002 మార్చి 31న నివేదికను సమర్పించింది. బీజేపీకి పార్లమెంటులో పూర్తి మెజారిటీ లేకపోవడం వల్ల ఈ సమీక్షను చేపట్టలేక పోయింది. పార్లమెంటు ఆమోదం లేకుండానే వాజపేయి ప్రభుత్వం ఈ రాజ్యాంగ సమీక్ష కమిషన్ను వేసింది. ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఈ సిఫారసులను ఆయా ప్రభుత్వ శాఖలు పరిశీలిస్తాయని అంటున్నది. ఇప్పటికీ బీజేపీ నేతలు రాజ్యాంగాన్ని సమీక్షించాలని పదేపదే అంటూనే ఉన్నారు.
రాజ్యాంగ నిర్మాతలు కూడా కాలానుగుణంగా రాజ్యాంగానికి ఎన్ని మార్పులైనా చేసుకోవడానికి అవకాశాలను పొందుపరిచారు. అంబేద్కర్ ఈ రాజ్యాంగ మార్పులను అనుమతించారు. దేశంలో 1951 చివరలో తొట్టతొలి సార్వత్రిక ఎన్నికలు జరగకముందు రాజ్యాంగ కమిషన్ పార్లమెంటుగా వ్యవహరించింది. ఈ రాజ్యాంగ కమిషన్ – పార్లమెంటు స్వయంగా తొలి రాజ్యాంగ సవరణ తీసుకువచ్చింది. ఈ సవరణ నెహ్రూ, అంబేద్కర్ కనుసన్నల్లోనే జరిగింది. ఆ తర్వాత ఇప్పటివరకూ వందసార్లకు పైగా రాజ్యాంగ సవరణ జరిగింది. జాతీయ పార్టీలే ఈ సవరణలను తెచ్చాయి. బీజేపీ నాయకులు రాజ్యాంగాన్ని మార్చాలని వ్యాఖ్యానించినప్పుడల్లా దుమారం చెలరేగుతున్నది. ఎందుకంటే వీరి ఉద్దేశాలు వేరు. బహిరంగంగా చెప్పేదొకటి, చేసేదొకటి. ప్రజలకు, మేధావులకు వీరిపట్ల విశ్వసనీయత లేదు. అందువల్ల లోపాయికారిగా చేస్తూ ఉంటారు.
రాజ్యాంగాన్ని మొత్తంగా సమీక్షించాలని కమిషన్ వేసింది బీజేపీ ప్రభుత్వం. రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా మాట్లాడేది బీజేపీ నాయకులు. రాజ్యాంగ మౌలిక లక్ష్యాలకు వ్యతిరేకంగా పాలిస్తున్నది బీజేపీ ప్రభుత్వం. ఇదంతా మరిచి నిజాయితీగా కొత్త రాజ్యాంగం రాసుకుందామని కేసీఆర్ అంటే దేశద్రోహమా? బీజేపీ నేతలు రాజ్యాంగంపై ఏమైనా మాట్లాడవచ్చు. కానీ కేసీఆర్ అదే మాట అంటే దళిత వ్యతిరేకమా? అంటే.. బీజేపీ నాయకులు మాత్రం రాజ్యాంగ సమీక్షకు కమిషన్ వేయవచ్చు.. అది కుట్ర కాదు! బీజేపీ నాయకులు మాత్రం అధ్యక్ష తరహా పాలనకు ప్రతిపాదనలు చేయవచ్చు.. అది కుట్ర కాదు! బీజేపీ నాయకులు మాత్రం జమిలి ఎన్నికలకు ప్రతిపాదనలు చేయవచ్చు.. అది మాత్రం కుట్ర కాదు! దేశ ప్రగతికి అడ్డంకిగా ఉన్న అంశాలను గుర్తించి, వాటిని సవరించేలా రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ అంటే మాత్రం ఇదే బీజేపీ నేతలకు కుట్రగా కనిపిస్తున్నది.
2008లో బీజేపీ నేత అనంత్కుమార్ హెగ్డే రాజ్యాంగం మార్చాలంటూ చేసిన ఒక వ్యాఖ్యపై దుమారం చెలరేగడంతో ఆయన విచారం వ్యక్తం చేసి ఉపసంహరించుకున్నారు. రాజ్యాంగ మౌలిక లక్ష్యాల పట్ల యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అసహనం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం మొదటిసారి ఏర్పడిన తర్వాత పత్రికలకు ఇచ్చిన ప్రకటనలో భారత రాజ్యాంగ ప్రవేశికలో లౌకిక వాదం, సామ్యవాదం అనే పదాలు గల్లంతయ్యాయి.