హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) షాకిచ్చింది. కాలేజీల్లో బోధించే 60 శాతం కోర్సులకు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్ (ఎన్బీఏ)ను తప్పనిసరి చేసింది. ఈ గుర్తింపు పొందేందుకు రెండేండ్లు గడువు విధించింది. ఈ మేరకు ఇంజినీరింగ్ కాలేజీలకు ఏఐసీటీఈ అప్రూవల్ బ్యూరో సలహాదారు ప్రొఫెసర్ రాజేంద్ర కాకడే ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు. అక్రెడిటేషన్ పొందకుంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ అప్రూవల్ (ఈవోఏ)ను జారీచేయబోమని.. అనుబంధ గుర్తింపును పొడగించలేని పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించారు.
ఈ కోర్సులను బోధించే అధ్యాపకులు, ల్యాబ్లు, విద్యార్థుల ర్యాంకులు, బీటెక్లో ఉత్తీర్ణత, సగటు మార్కులు, క్యాంపస్ ప్లేస్మెంట్స్, ఉన్నత విద్యకు వెళ్లేవారి శాతం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని అక్రెడిటేషన్ జారీచేస్తారు. బీటెక్తోపాటు మేనేజ్మెంట్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ తదితర కోర్సులకు ఎన్బీఏ గుర్తింపునిస్తున్నది. ఎన్బీఏ అక్రెడిటేషన్ గల కాలేజీల్లో బీటెక్లో చేరిన వారికి రాష్ట్రంలో అదనంగా రూ.5 వేలు ఫీజుగా వసూలు చేస్తున్నారు.