ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు పెట్టకపోతే మిలిటెంట్ తరహా ఉద్యమాన్ని చేస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య అన్నారు. అప్పడు గానీ కేంద్ర ప్రభుత్వం దిగిరాదని చెప్పారు. పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో ఢిల్లీలోని జంతర్ మంతర్లో మహా ధర్నా చేపట్టారు. అనంతరం బీసీ బిల్లు కోరుతూ, వందలాది మంది బీసీలు పార్లమెంట్ ముట్టడికి యత్నించారు. పార్లమెంట్ స్ట్రీట్ మీదుగా పార్లమెంట్ వైపు వెళ్లేందుకు బారికేడ్లను దూకే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు ఆందోళన కారులను అడ్డుకున్నారు. అనంతరం ఆర్ కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు.
దేశంలోని 75 కోట్ల మంది బీసీలకు రాజ్యాంగపరమైన హక్కులు, మానవ హక్కులు కల్పించకుండా కేంద్ర ప్రభుత్వం అణచి వేస్తున్నదన్నారు. బీసీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఎలాంటి పథకాలు, రాయితీలు కల్పించకుండా అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. బీసీ జనాభా 56 శాతం ఉంటే 27 శాతం రిజర్వేషన్లు పెట్టారన్నారు. పంచాయత్ రాజ్ సంస్థలలోని బీసీ రిజర్వేషన్లు 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గించారని చెప్పారు. కేంద్ర బడ్జెట్ 38 లక్షల 45 వేల కోట్లు ఉంటే బీసీలకు కేవలం రూ.1400 కోట్లు కేటాయిస్తారా? అని నిలదీశారు. ఇంత తక్కువ బడ్జెట్తో దేశంలోని 75 కోట్ల మంది బీసీలకు బిస్కెట్లు కూడా రావన్నారు. బీసీల డిమాండ్లను పరిష్కరించకపోతే కేంద్ర మంత్రులను దేశ వ్యాప్తంగా అడ్డుకుంటామని హెచ్చరించారు. బీజేపీ పార్టీ.. బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకొని బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాలలో వెనుకబడి ఉన్న బీసీలకు రాజకీయ రంగంలో రిజర్వేషన్లు పెట్టడానికి ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. బీసీలకు ఇచ్చేది బిక్షం కాదు రాజ్యాంగ బద్ధమైన హక్కు అని గుర్తు చేశారు.
పార్లమెంట్లో బీసీ బిల్లు సాధించే వరకు వెనక్కి తగ్గేది లేదని బీసీ నేత దాసు సురేశ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణతో బీసీలు ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 39.85 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ను అగ్ర వర్ణాలు, పారిశ్రామిక వేత్తలు, వాణిజ్య, వ్యాపార సంస్థలు తీసుకుపోతుంటే బీసీలు చూస్తూ ఊరుకోరన్నారు. అందులో 50 శాతం వాటా చట్టబద్ధంగానే బీసీలకు దక్కాలన్నారు. న్యాయవ్యవస్థలో కూడా 50 శాతం రిజర్వేషన్లను బీసీలకు కల్పించాలని డిమాండ్ చేశారు. ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్, కేంద్రీయ విద్యాలయాల్లో స్కాలర్షిప్స్ సకాలంలో అందక బీసీ బిడ్డలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అందువల్ల ప్రైవేటు రంగ సంస్థల్లో 50 శాతం బీసీల రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ముట్టడిలో బీసీ నేతలు గుజ్జ కృష్ణ, కృష్ణ, నీల వెంకటేష్, జి.అనంతయ్య, భుపేష్ సాగర్, వేముల రామకృష్ణ, బి.సి వెంకట్, జక్కుల వంశీ కృష్ణ, జక్కని సంజయ్, ఉదయ్, అరవింద్, లింగయ్య యాదవ్, రామూర్తి తదితరులు పాల్గొన్నారు.