Women Bill | చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించే మహిళా బిల్లు చారిత్రక అవసరమేనని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి చెప్పారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లుకు అన్ని పార్టీలు ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. వచ్చే వారం జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా బిల్లు ప్రవేశ పెట్టాలని దుండ్ర కుమారస్వామి కోరారు. మహిళా బిల్లు సాధన కోసం కేంద్రం పై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. మహిళా బిల్లు, బీసీలకు ప్రత్యేక వాటా కల్పించేందుకు కేంద్రంపై దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఒత్తిడి తేవాలన్నారు. మహిళలకు విస్తృత అవకాశాలు లేకపోతే దేశ ప్రగతి కూడా సాధ్యం కాదనే విషయం కేంద్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు.
సెప్టెంబర్ 18 నుంచి నిర్వహించనున్న ప్రత్యేక సమావేశాల్లో సుదీర్ఘకాలం పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజకీయాలకు అతీతంగా ఏకమై అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని దుండ్ర కుమారస్వామి కోరారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర యువత అధ్యక్షుడు రుబిన్ గౌడ్ సమన్వయకర్తగా జరిగిన సమావేశంలో అధ్యక్షుడు కుమారస్వామి ప్రసంగిస్తూ బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏ కూటమితో పాటు ఇండియా కూటమి, ఇతర పార్టీలు కూడా మహిళా బిల్లుకు ఆమోదం తెలపడానికి కదలిరావాలనిన్నారు.
అన్ని రంగాల్లో మహిళలకు అన్యాయమే జరుగుతోందని దుండ్ర కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా బిల్లు కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపట్టిన పోరాటానికి ఇప్పటికే మంచి మద్దతు లభించిందని తెలిపారు. మహిళా బిల్లుకు ఆమోదం లభిస్తే చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు లభించడం ద్వారా వారి అభివృద్ధికి మరింత తోడ్పాటు ఇచ్చే అవకాశం కలుగుతుందన్నారు. బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలన్నారు. బీజేపీ కుట్రల విషయంలో కూడా ఇతర పార్టీలు కాస్త ఆచితూచి వ్యవహరించాలని సూచించారు.