హైదరాబాద్ : తెలంగాణలోని పల్లెలకు మరోసారి తొమ్మిది జాతీయ అవార్డులు రావడం అభినందనీయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు( Minister Errabelli) అన్నారు. సీఎం కేసీఆర్(CM KCR),కేటీఆర్(KTR) మార్గనిర్దేశకత్వంలో పల్లె ప్రగతి(Palle pragathi)కి అవార్డులు దక్కినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు.
జాతీయ అవార్డుల(National Awards) ప్రకటన అనంతరం మంత్రి ఎర్రబెల్లి స్పందించారు. దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలిచిందన్నారు. ఈ అవార్డుల రావడానికి కృషి చేసిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావు, డీఆర్డీవోలు, డీపీవోలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, గ్రామ కార్యదర్శులు, పంచాయతీరాజ్ సిబ్బంది, సర్పంచ్ లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలకు మంత్రి అభినందనలు తెలిపారు.
అవార్డులు వచ్చిన గ్రామాలు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని, రాని గ్రామాలు అవార్డులు తెచ్చుకోవడానికి పట్టుదలతో పని చేయాలని సూచించారు. గతంలోనూ స్వచ్ఛ, పారిశుధ్య, ఇ- పంచాయతీ, ఉత్తమ గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలు, బహిరంగ మల మూత్ర రహిత రాష్ట్రం, ఉత్తమ ఆడిటింగ్ వంటి అంశాలలో అవార్డులు వచ్చాయన్నారు. వందశాతం నల్లాల ద్వారా మంచినీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా, ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా, అనేకానేక అవార్డులు, రివార్డులు వచ్చాయన్నారు.
ఆయా అంశాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలని మిగతా రాష్ట్రాలకు కేంద్రం సూచించిందని పేర్కొన్నారు. మిషన్ కాకతీయ(Mission Kakatiya), మిషన్ భగీరథ(Mission Bhagitha), కేసీఆర్ కిట్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు , కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు దేశానికి ఆదర్శంగా నిలిచాయని మంత్రి పేర్కొన్నారు.