హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): సమాజంలో నిరాదరణకు గురవుతున్న బుద్ధిమాంద్య, దివ్యాంగ బాలల కోసం అనుక్షణం తపిస్తున్న డాక్టర్ పసుపులేటి హన్మంతరావును పద్మశ్రీ అవార్డు వరించింది. దివ్యాంగ, బుద్ధిమాంద్య బాలల కోసం దేశంలోనే మొట్టమొదటిసారిగా స్వీకార్ అకాడమీ ఆఫ్ రిహాబిలిటేషన్ సెంటర్ను హన్మంతరావు ప్రారంభించారు. ప్రస్తుతం దానికి ఫౌండర్ చైర్మన్గా సేవలందిస్తున్నారు. 1945 సెప్టెంబర్ 16న హైదరాబాద్లో జన్మించారు. 1964లో వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివారు. అనంతరం హైదరాబాద్లోని నిలోఫర్ హాస్పిటల్లో పీడియాట్రిక్స్లో ఎండీ చేశారు. తర్వాత ముంబైలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ మెడిసిన్ అండ్ రీహాబిలిటేషన్ సంస్థలో రీహాబిలిటేషన్ మెడిసిన్ కోర్సు చదివారు. ఇదే అంశంపై ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పొందారు. వైద్యుడిగా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అంగవైకల్యం, బుద్ధిమాంద్యంతో బాధపడుతున్న పిల్లల పట్ల సమాజం సరైన దిశలో ఆలోచించడం లేదని ఆయనకు అర్థమైంది. వారికి శిక్షణ, పునరావాసం అవసరమని, సరైన శిక్షణ ఇస్తే వాళ్లు సైతం సాధారణ జీవితం గడిపే అవకాశం ఉన్నదని గుర్తించారు.
ఐదుగురు పిల్లలతో గ్యారేజీలో ప్రారంభమై
దేశంలోనే మొట్టమొదటిసారిగా 1977లో బుద్ధిమాద్యంతో బాధపడుతున్న పిల్లల కోసం ప్రత్యేకంగా పాఠశాలను ప్రారంభించారు. తన ఇంటి గ్యారేజీలో ఐదుగురు పిల్లలతో ప్రారంభమైన స్వీకార్ రిహాబిలిటేషన్ సెంటర్ ఆయన కృషి ఫలితంగా ఇప్పుడు 450 గదులతో 1700 మందికి శిక్షణ ఇచ్చే స్థాయికి ఎదిగింది. 150 మంది సిబ్బంది ఇందులో పనిచేస్తున్నారు. బాధితులకు సరైన శిక్షణ లభించాలంటే తానొక్కడయితే సరిపోదని గ్రహించి శిక్షణ పొందిన నిపుణులను తయారు చేసేందుకు స్వీకార్ అకాడమీని ప్రారంభించారు. తెలంగాణలో తాండూరు, రాయలసీమలో కడప, కోస్తాంధ్రలో గుంటూరు క్యాంపస్లు ప్రారంభించారు. 19 రకాల శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ మూడు క్యాంపస్ల ద్వారా ఇప్పటివరకు 4,565 మంది శిక్షణ పొందారు. వారందరూ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వీరి ద్వారా 59 లక్షల మందికి లబ్ధి కలిగిందని డాక్టర్ హన్మంతరావు తెలిపారు. 6,500 మంది ప్రొఫెషనల్స్ను తయారు చేసి 69 లక్షల మందికి లబ్ధి చేకూర్చాలన్నదే తన లక్ష్యమని చెప్పారు.
పిల్లలకే కాదు అన్ని వయసుల్లో ఉన్న బుద్ధిమాంద్యులను, వృద్ధులను ఆదుకునేందుకు స్వీకార్, ఉపకార్, ఆశ్రయ్, సురక్ష పేర్లతో నాలుగు స్వచ్ఛంద సంస్థలను స్థాపించారు. ఇందులో బుద్ధి మాంద్యులు, అంధులు, బధిరులు, మానసిక సమస్యలతో బాధపడుతున్నవారు, డ్రగ్స్ బానిసలు, వృద్ధులు, వితంతువులకు ఆశ్రయం కల్పిస్తున్నారు.
ఎన్నో సంస్థలు,ఎన్నో పదవులు
ఆయన 17 స్వచ్ఛంద సంస్థల్లో సభ్యుడిగా, మరో మూడింటికి సలహాదారుగా ఉన్నారు. రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా, నేషనల్ కమిటీ ఆన్ మెంటల్ రిట్రెడిషన్కు చైర్మన్గా, చైల్డ్హుడ్ డిసెబిలిటీ గ్రూప్ ఆఫ్ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిషియన్కు చైర్మన్గా వ్యవహరించారు.
అవార్డులు,రివార్డులు
హన్మంతరావు సేవలకు జాతీయంగా, అంతర్జాతీయంగా 37 అవార్డులు, రివార్డులు వచ్చాయి. తనకు పద్మశ్రీ అవార్డు రావడం పట్ల హన్మంతరావు సంతోషం వ్యక్తం చేశారు. శారీరకంగా, మానసికంగా లోపాలతో సమాజంలో నిరాదరణకు గురైన వర్గానికి సేవ చేయడం తనకు ఆనందాన్ని ఇస్తున్నదన్నారు.