హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో అత్యంత పొదుపుగా నీటిని వినియోగిస్తున్నందుకు సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం (ఎస్టీపీపీ)కి జాతీయ అవార్డు లభించింది. ముంబైకి చెందిన మిషన్ ఎనర్జీ ఫౌండేషన్ సంస్థ బుధవారం నిర్వహించిన జాతీయ సదస్సులో ఈ అవార్డును ప్రకటించారు. గురువారం సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ చేతుల మీదుగా డైరెక్టర్ సత్యనారాయణరావు అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ప్లాంట్ అధికారులు, సిబ్బందిని సీఎండీ అభినందించారు. ఒక మెగావాట్ విద్యుత్తు ఉత్పత్తికి 3 క్యూబిక్ మీటర్ల వరకు నీటిని వినియోగించవచ్చని మార్గదర్శకాలు చెప్తున్నాయి. కాగా సింగరేణి వినియోగం 2.3 క్యూబిక్ మీటర్ల వరకు ఉంది.
వచ్చే మార్చి నాటికి ఫ్లోటింగ్ సౌరవిద్యుత్ ప్లాంట్
సింగరేణివ్యాప్తంగా నిర్మిస్తున్న సోలార్ ప్లాంట్లలో వచ్చే ఏడాది మార్చి నాటికి నీటిపై తేలియాడే (ఫ్లోటింగ్) 15 మెగావాట్ల ప్లాంట్ను ఏర్పాటు చేయాలని, తొలి విడతగా.. 5 మెగావాట్ల ప్లాంట్ను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని గురువారంఅధికారులతో జరిపిన ప్రత్యేక సమావేశంలో సీఎండీ ఎన్ శ్రీధర్ ఆదేశించారు. సింగరేణి జాతీయస్థాయిలో ఏడో ఉత్తమ కేంద్రంగా ఎంపిక కావడంపై డైరెక్టర్ సత్యనారాయణ, చీఫ్ టెక్నికల్ కన్సల్టెంట్ సంజయ్కుమార్ సూర్, ఓ అండ్ ఎం చీఫ్ జేఎన్ సింగ్ తదితర అధికారులను అభినందించారు.