Singareni | సింగరేణి సంస్థ జాతీయ స్థాయిలో అత్యుత్తమ జియో మైన్టెక్ ‘గ్లోబల్ రెయిన్బో’ అవార్డును అందుకుంది. సంస్థ డైరెక్టర్ ఎన్ బలరాంను సైతం ఇన్నొవేటివ్ లీడర్షిప్ ఎక్స్లెన్స్ అవార్డును సత్కరించింది. జాతీయ స్థాయిలో అత్యుత్తమ ఖనిజ కంపెనీలు, అధికారులను గుర్తించి, జియోమైన్టెక్ సంస్థ గురువారం ఒడిశా రాజధాని భువనేశ్వర్లో జరిగిన నేషనల్ టెక్నాలజీ డే కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేసింది.
ఒడిశా పర్యావరణ, అటవీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ప్రదీప్ కుమార్ అమత్ అవార్డులను సింగరేణి సంస్థ తరఫున హాజరైన జీఎం బీహెచ్ వెంకటేశ్వర్లు, ఏజీఎం మజుందార్, ఎస్ఈ రాజశేఖర్కు అందజేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సాధించిన అత్యుత్తమ బొగ్గు ఉత్పత్తి, రవాణా, సీఎస్ఆర్ కార్యక్రమాలు, పర్యావరణ చర్యలకు గుర్తింపుగా జియోమైన్టెక్ వారు ‘విబ్జియార్ గోల్డెన్ రెయిన్బో’ అవార్డును సింగరేణికి ప్రకటించి అందించారు. అలాగే పర్యావరణ, అటవీ విభాగాల్లో అందిస్తున్న సేవలకు సంస్థ డైరెక్టర్ ఎన్ బలరాంకు బెస్ట్ డైరెక్టర్గా కార్పొరేట్ మేనేజ్మెంట్, ఇన్నొవేటివ్ లీడర్షిప్ ఎక్స్లెన్స్ అవార్డును బహూకరించారు.
వన ప్రేమికుడైన బలరాం సొంతంగా 15వేల మొక్కల్ని స్వయంగా నాటారు. కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుక గ్రీవెన్స్ డే నిర్వహించి, కార్మికుల సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేశారు. బ్యాంకు ఖాతాలున్న సింగరేణి ఉద్యోగులందరికీ వారి ఖాతాలను కార్పొరేట్ శాలరీ అకౌంట్లుగా మార్పించి ప్రమాద బీమా సౌకర్యాన్ని బ్యాంకుల ద్వారా వర్తించేలా ప్రత్యేక చొరవ చూపారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ బలరాంకు అవార్డు రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.