హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ)/సిరిసిల్ల టౌన్: సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్ మరో ఘనతను సాధించారు. గతంలో అగ్గిపెట్టెలో పట్టే జరీ చీరను నేసి మన్ననలు పొందిన హరిప్రసాద్.. ఈసారి పట్టు వస్త్రంపై ఎలాంటి కుట్లు, అల్లికలు, ప్రింటు ఉపయోగించకుండానే జాతీయ గీతాన్ని నేశారు. రెండు మీటర్ల పొడవు, 47 ఇంచుల వెడల్పు గల ఒకే వస్త్రంపై తెలుగులో జాతీయ గీతంతోపాటు మూడు రంగులతో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లోగో, భారతదేశ పటం, అశోకచక్రాన్ని రూపొందించడం విశేషం. వస్ర్తానికి రెండువైపుల అంచులకు మహిళలు నమస్కరిస్తున్న చిత్రాలను తీర్చిదిద్దారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు జరుపుకొంటున్న సందర్భంగా ఐదు రోజుల్లోనే దానిని రూపొందించినట్టు ఆయన తెలిపారు. గతంలో ఒక గ్రాము బంగారంతో శాలువాపై వినాయకుడి బొమ్మను రూపొందించి హరిప్రసాద్ వార్తల్లో నిలిచారు. పవర్లూమ్పై అరుదైన ఘనతలు సాధిస్తున్న హరిప్రసాద్ను ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఆదివారం ట్విట్టర్ వేదికగా అభినందించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల సందర్భంగా ఆయన చీరపై జాతీయ గీతాన్ని నేయడాన్ని మంత్రి ప్రశంసించారు.