హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో డిజిటల్ సాధికారత దిశగా నాస్కామ్ ఫౌండేషన్, డీఎక్స్సీ టెక్నాలజీస్ కృషి చేస్తున్నాయి. ఇరు సంస్థలు కలిసి ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీమ్ జిల్లాల్లో లక్ష మందికి డి జిటల్ అక్షరాస్యతను అందించే దిశగా చర్య లు చేపట్టాయి. ఇందులో భాగంగా ఆయా జి ల్లాల్లో టెక్నాలజీ డిజిటల్ లిటరసీ, ఈ-గవర్నెన్స్ కోసం ఐదు రిసోర్స్ కేంద్రాలను ప్రారంభించాయి. ఈ కేంద్రాల ద్వారా డిజిటల్ అక్షరాస్యతను అందించడంతోపాటు సుమారు 1,400 మందిలో సాంకేతిక ఆధారిత నైపుణ్యాలను పెంచనున్నారు.
ఈ కార్యక్రమంలో డిజిటల్, ఆర్థిక అంశాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా సరళీకృత డిజిటల్ పరిష్కారాలను సైతం చూపనున్నారు. నాస్కామ్ ఫౌండేషన్ సీఈవో నిధి బాసిన్ మాట్లాడుతూ దేశంలోని మారుమూల ప్రాంతాల పేదలకు సాంకేతికత ను అందుబాటులోకి తెచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. డీఎక్స్సీ టెక్నాలజీ వైస్ ప్రెసిడెంట్ లోకేంద్ర సేథీ మాట్లాడుతూ ఫౌండేషన్ భాగస్వామ్యంతో యువతలో విద్య, నైపుణ్య అవకాశాలను పెంచడమే లక్ష్యం అని వివరించారు.