ఒకటి.. రెండు, రెండు.. మూడు, మూడు, మూడు.. నాలుగు, ఐదు.. ర్యాంకుల్లోనే కాదు.. చావుల్లోనూ మేమే టాప్.. చదువుల్లోనే కాదు చావుల్లోనూ మేమే గ్రేట్.. మాకు మేమే సాటి.. మాకెవ్వరూ రారు పోటీ.. ఇది మా ఖ్యాతి.. చేరితే చావే గతి.. కార్పొరేట్ కాలేజీల వ్యవహారశైలిపై ఇలాంటి ప్రకటనలివ్వాలి ఇప్పుడు.
మణికొండ, మార్చి 1 (నమస్తే తెలంగాణ): నార్సింగిలోని ఓ ప్రైవేటు కాలేజీ విద్యార్థి సాత్విక్ (16) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. లెక్చరర్లు, యాజమాన్యం పెట్టే ఒత్తిడిని తట్టుకోలేక తరగతి గదిలోనే ఉరి వేసుకున్నాడు. ఈ ఒక్క క్యాంపస్లోనే జరిగిన ఐదో ఆత్మహత్య ఇది. పూర్తి వివరాల్లోకి వెళితే. రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని ఓ ప్రైవేటు కళాశాలలో కేశంపేట ప్రాంతానికి చెందిన సాత్విక్ ఇంటర్(ఎంపీసీ) మొదటి సంవత్సరంలో చేరాడు. జైల్లో హింసించినట్టుగా కాలేజీ సిబ్బంది వ్యవహరించటంతో తల్లడిల్లిపోయాడు. ఉదయం 4గంటలకు లేచినప్పటి నుంచి రాత్రి 10.30గంటల వరకు ప్రత్యేక తరగతుల పేరిట కళాశాల యాజమాన్యం పిల్లలపై అదనపు భారం మోపింది. ఇటీవల శివరాత్రి సెలవు రోజు ఇంటికెళ్లిన సాత్విక్ కాలేజీలో తాను ఎదుర్కొంటున్న హింసగురించి తల్లిదండ్రులకు చెప్పాడు. తన ఆరోగ్యం బాగోలేదని చికిత్స కూడా తీసుకున్నాడు. సెలవు అనంతరం మళ్లీ కాలేజీకి వచ్చాడు.
చదువు తప్ప మరో ధ్యాస లేదన్నట్టు లెక్చరర్లు ప్రవర్తించటంతో విసిగిపోయిన సాత్విక్ మంగళవారం రాత్రి ప్రత్యేక తరగతులు కొనసాగుతుండగానే టెర్రస్పైకెళ్లి బట్టలు ఆరేసుకునే తాడును గదిలోకి తెచ్చుకున్నాడు. అప్పటికే క్లాస్ పూర్తవ్వటంతో మిగతా విద్యార్థులంతా హాస్టల్ గదులకెళ్లిపోయారు. సాత్విక్ మాత్రం తరగతి గదిలో ఉరివేసుకున్నాడు. ఎంతసేపటికి హాస్టల్కు సాత్విక్ రాకపోవటంతో స్నేహితులు వాచ్మెన్ను తమ ఫ్లోర్ తాళం తీయాలని వేడుకున్నారు. ప్రిన్సిపాల్ అనుమతి కావాలంటూ తాత్సారం చేశాడు. గంట తర్వాత తాళం తీయటంతో స్నేహితులు క్యాంపస్ అంతా వెతికారు. చివరకు తరగతి గదిలోకి వెళ్లి చూడగా సాత్విక్ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ కనిపించాడు. హుటాహుటిన ప్రైవేటు దవాఖానకు తరలించారు. కానీ, అప్పటికే మృతి చెందాడు.
విషయాన్ని పొక్కనివ్వని యాజమాన్యం
కాలేజీ యాజమాన్యం విషయాన్ని బయటకు పొ క్కనీయలేదు. పోలీసులు అత్యుత్సాహంతో రాత్రికి రాత్రే సాత్విక్ మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. యాజమాన్యం విద్యార్థి బాగోగులపై ఏమాత్రం స్పందించకపోగా పోలీసులతో వ్యవహారాన్ని చక్కదిద్దే పనిలో ఉండిపోయింది. సాత్విక్ తల్లిదండ్రుల ఆందోళనతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.
వేధింపుల వల్లే ఆత్మహత్య : తల్లిదండ్రులు
యాజమాన్యం వేధింపుల వల్లే తమ కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడంటూ తల్లిదండ్రులు అలివేలు, రాజప్రసాద్ ఆరోపిస్తున్నారు. లెక్చరర్లు, సి బ్బంది వేధించారని, ఈ విషయం సాత్విక్ తమతో చెప్పుకున్నాడని తెలిపారు. గతంలో తమ కొడుకును లెక్చరర్లు కొట్టారని, పిల్లవాడి ఆరోగ్యం బాగాలేదని కొట్టవద్దంటూ యాజమాన్యాన్ని కోరామని గుర్తు చేశారు. కాలేజీ యాజమాన్యంపై, అడ్మిన్ ప్రిన్సిపాల్ ఆచార్య, ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ జగన్, వార్డెన్పై కేసు పెట్టాలని తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు రోడ్డుపై ఆందోళకు దిగారు.
మా చావుకొచ్చిందీ చదువు : తోటి విద్యార్థులు
నార్సింగ్ క్యాంపస్లో వేధింపులు సెంట్రల్జైల్ను తలపించేలా ఉంటాయని సాత్విక్తోపాటు అదే క్యాంపస్లో చదువుతున్న విద్యార్థులు చెప్తున్నారు. సరైన భోజనం, నీళ్లు ఉండవని, అడిగితే టార్గెట్ చేస్తున్నారని కన్నీటిపర్యంతమయ్యారు.
2 వేల మందికి ఒకే క్యాంపస్
అనుమతి పొందింది ఒక్క కళాశాలకే అయితే నాలుగు కళాశాలలకు చెందిన విద్యార్థులను ఇదే క్యాంపస్లో చదివిస్తున్నారని విద్యార్థులు తెలిపారు.
అమ్మానాన్నా.. క్షమించండి!
‘అమ్మా, నాన్నా, అన్నా.. నేను ఈ పని చేస్తున్నందుకు నన్ను క్షమించండి. మిమ్మల్ని బాధపెట్టాలని కాదు. కాలేజిలో పెట్టే ఇబ్బందులను, వీరు చూపే నరకాన్ని భరించకలేకనే ఈ పని చేస్తున్నాను. మిస్ యూ’ అంటూ సాత్విక్ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం సాయంత్రం అతని వస్తువులు కళాశాల నుంచి తీసుకుంటున్న తరుణంలో ఈ లేఖ దొరికింది. ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి, అడ్మిన్ ప్రిన్సిపాల్ ఆచార్య, శోభన్, క్యాంపస్ ఇన్చార్జి నరేశ్ వేధింపులతోనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు అందులో పేర్కొన్నాడు. తనతో పాటు తన మిత్రులకు కాలేజి యాజమాన్యం నరకం చూపిస్తున్నారని, వారిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలని ఆ లేఖలో కోరాడు. ‘మీ అందరిని బాధ పెడుతున్నందుకు సారీ, నన్ను క్షమించండి, నా కోసం మీరు బాధపడితే నా ఆత్మ శాంతించదు. మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. అమ్మా, నాన్నకు నేను లేని లోటు రాకుండా చూసుకో అన్నా’ అంటూ లేఖలో కోరాడు. అతను రాసిన లేఖ పూర్తిగా నలిగిపోయి ఉండటం చూస్తే అది ఎన్నో రోజుల కిందరాసి పెట్టుకున్నట్టు కనిపిస్తున్నదని అతని స్నేహితులు పేర్కొన్నారు.