CM KCR | హైదరాబాద్ : ప్రస్తుతం నర్సాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మదన్ రెడ్డికి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. పార్టీలో అంతర్గత సర్దుబాటు చేస్తూ, అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో భేటీ అయిన పార్టీ కోర్ కమిటీ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం సునీతా లక్ష్మారెడ్డిని నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కేసీఆర్ ఖరారు చేశారు. అనంతరం ఆమెకు బీ-ఫామ్ అందజేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ కీలక సభ్యులు ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘మదన్ రెడ్డి నాతో పార్టీలో మొదటినుంచి కొనసాగుతున్న సీనియర్ నాయకుడు. 35 ఏండ్ల నుంచి నాతో సన్నిహితంగా కొనసాగుతున్న నేతగా నాకు అత్యంత ఆప్తుడు. నాకు కుడి భుజం లాంటివాడు. సోదర సమానుడు. పార్టీ ఆలోచనలను గౌరవించి నర్సాపూర్ ఎన్నికలను తన భుజ స్కందాలమీద వేసుకుని సునీత లక్ష్మారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత తీసుకున్నందుకు సంతోషంగా ఉంది. ప్రస్తుతం కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీగా కొనసాగుతున్న పార్లమెంటరీ స్థానం నుండి మదన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ కీలక సభ్యులకు, కార్యవర్గానికి అభినందనలు. వారి సీనియార్టీని పార్టీ గుర్తించి గౌరవించినందుకు పార్టీ ముఖ్య కార్యవర్గాన్ని అభినందిస్తున్నాను. మెదక్ జిల్లాలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా కేవలం నర్సాపూర్లోనే కాకుండా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వారు పాపులర్ లీడర్. వివాద రహితుడైన మదన్ రెడ్డి సేవలను పార్టీ మరింత గొప్పగా వినియోగించుకోవాల్సి ఉంది. చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకుంటూ కీలక సమయంలో ఐక్యంగా ముందుకు పోవడం ద్వారా మదన్ రెడ్డి పార్టీ ప్రతిష్టను మరింత ఇనుమడింప చేశారు. వారికి నా ధన్యవాదాలు అభినందనలు’ అని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తెలిపారు.