గంగాధర, ఆగస్టు 22: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామస్తులు పోరుబాటపట్టారు. తమ ఊరును ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్ష 14వ రోజుకు చేరింది. దీక్షలో భాగంగా శనివారం మధురానగర్ చౌరస్తాలో కరీంనగర్- జగిత్యాల జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. పోలీసులు గ్రామస్తులను బలవంతంగా పక్కకు తీసుకెళ్తుండగా జరిగిన తోపులాటలో సహీనా కాలు విరుగగా 108లో కరీంనగర్లోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. మరో మహిళ సొమ్మసిల్లి పడిపోగా, మధురానగర్ చౌరస్తాలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ధర్నా చేస్తున్న నాయకులు, గ్రామస్తులను అరెస్ట్ చేసి రామడుగు ఠాణాకు తరలించారు.

పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, సీఐ స్థాయి అధికారి ఓ యువకుడిని బూతులు తిట్టాడని గ్రామస్తులు ఆరోపించారు. నారాయణపూర్ రిజర్వాయర్తో అష్ట కష్టాలు పడుతున్నామని, ముంపుగ్రామంగా ప్రకటించేదాకా నిరసన కొనసాగిస్తామని స్పష్టంచేశారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్ఎస్, ఏఐబీఎఫ్బీ, సీపీఎం నాయకులు గ్రామస్తులకు మద్దతుగా ధర్నాలో పాల్గొనగా పోలీసులు అరెస్ట్ చేసి ఠాణాకు తరలించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ మా ట్లాడుతూ.. నారాయణపూర్ను ముంపు గ్రా మంగా ప్రకటించాలని కోరితే ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గ్రామస్తులపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని దుయ్యబట్టారు. గ్రామస్తులపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.