ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగామొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు
మనోహరాబాద్, జూన్ 5 : పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పురం మహేశ్, వైస్ ఎంపీపీ విఠల్రెడ్డి అన్నారు. మనోహరాబాద్ మండలం రంగాయిపల్లిలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శనివారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరుగుతున్న కాలుష్యంతో పర్యావరణం కలుషితమవుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ హరితహారంలో భాగంగా ఏటా కోట్లాది మొక్కలు నాటిస్తున్నారని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతిఒక్కరూ కనీసం ఐదు మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ నాగభూషణం, గ్రామస్తులు పాల్గొన్నారు.
నాటిన ప్రతి మొక్కనూ రక్షించాలి..
తూప్రాన్ రూరల్, జూన్ 5 : హరితహారంలో భాగంగా గ్రామాల్లో నాటిని ప్రతి మొక్కనూ రక్షించాలని సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు భగవాన్రెడ్డి గ్రామస్తులకు సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నాగులపల్లిలో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా భగవాన్రెడ్డి మాట్లాడుతూ ప్రకృతి అందంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. మొక్కలను నాటడంతోపాటు వాటిని సంరక్షించే బాధ్యతను ప్రజలు తీసుకోవాలన్నారు. గ్రామంలో ప్రకృతి వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మొక్కలతోనే మానవ మనుగడ..
నిజాంపేట, జూన్ 5 : మానవ మనుగడకు మొక్కలే ఆధారమని, ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మండలంలోని నస్కల్లో గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఆదేశాల మేరకు మొక్కలు నాటామని, ప్రతిఒక్కరూ విధిగా మొక్కలు నాటి భవిష్యత్ తరాలకు నీడతోపాటు స్వచ్ఛమైన గాలిని అందించాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి..
చేగుంట, జూన్ 5 : ప్రతిఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్ సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని చేగుంటలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ మొక్కలు నాటేందుకు అధికారులు ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఉమాదేవి, ఎంపీవో ప్రశాంత్, రాంపూర్ సర్పంచ్ భాస్కర్, వ్యవసాయశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.