అమరావతి : ఏపీలో జరుగనున్న లోక్సభ, శాసనసభ ఎన్నికల సందర్భంగా మంగళవారం కూటమి నాయకులు మేనిఫెస్టో (Alliance Manifesto) ను విడుదల చేశారు. విజయవాడలోని ఉండవల్లిలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (Chandra Babu), జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan kalyan), బీజేపీ తరుఫున సిద్ధార్థ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు,పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. కూటమి మేనిఫెస్టోకు కేంద్ర సహకారం మెండుగా ఉంటుందని ధీమాను వ్యక్తం చేశారు. ముందుగా సూపర్ సిక్స్ (Super Six) తో విడుదల చేసిన మేనిఫెస్టోకు అదనంగా మూడు పార్టీల నాయకుల అభిప్రాయాలను తీసుకుని మరికొన్నింటిని జత పరిచామని వెల్లడించారు. ముఖ్యంగా యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరకక నిర్వీర్యం అవుతున్నారని , ప్రజల జీవితాల్లో వెలుగులు రావని , రాష్ట్రాన్ని కాపాడుకోవాలని అందరం కలిశామని తెలిపారు.
మెగా డీఎస్సీ (Mega DSC)పై మొదటి సంతకం
మెగా డీఎస్సీ (Mega DSC)పై మొదటి సంతకం, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్(Job Calenders) , పరిశ్రమల స్థాపనకు వీలుగా పాలసీలు తీసుకొస్తామని అన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు, రూ. 3వేల నిరుద్యోగ భృతి, స్కూల్కు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15 వేలు , మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం , దీపం పథకం కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలండర్లు(Gas Sylinders) ఉచితంగా అందజేస్తామని హామీ ఇచ్చారు. షణ్ముక వ్యూహంలో భాగంగా ఇంటింటికి నీరు, మొట్టమొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు, అంకుర సంస్థలకు రూ. 10 లక్షలు సబ్సిడీ, బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని ప్రకటించారు.
అమరావతి రాజధానిని పూర్తిచేస్తామని ప్రకటించారు. 50 సంవత్సరాలు దాటిన బీసీలకు నెలకు రూ. 4 వేలు, జనాభా దామషా ప్రకారం అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. బీసీల కోసం ప్రతి యేట రూ. 10 వేల కోట్లు ఖర్చు చేస్తామని అన్నారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు కూటమి ముందుకు వచ్చిందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. వైసీపీ పాలన లక్షలాది ఎకరాల ప్రజల ఆస్తులు కబ్జా చేశారని, స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చిన రూ. 12 వేల కోట్లును వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిందని వెల్లడించారు.