హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ) : పాలిటెక్నిక్ కోర్సులకు సాంకేతిక విద్యాశాఖ కొత్త రంగులద్దుతున్నది. వచ్చే విద్యాసంవత్సరం కోసం పాలిటెక్నిక్ కోర్సుల్లోని నాలుగు కోర్సుల పేర్లను మార్చనున్నది. 2,880 సీట్లను పెంచనున్నది. కంప్యూటర్ సైన్స్లో 1,320, మరో 10 కొత్త కోర్సుల్లో 2,280 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. 2025-26 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో 13,050 సీట్లుండగా, కొత్త సీట్ల పెంపు, కొత్త కోర్సులు ప్రవేశపెట్టడంతో మొత్తం సీట్ల సంఖ్య 18,330కు చేరనున్నది.
రాష్ట్రంలో ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో మొత్తంగా 15,780 సీట్లున్నాయి. డిమాండ్ అధికంగా ఉన్న కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్(సీఎస్) కోర్సులో ఏకంగా 1,320 సీట్లను పెంచబోతున్నది. ఇది వరకు ఈ కోర్సులో 1,420 సీట్లుండగా, కొత్త సీట్లు చేరడంతో మొత్తం సీట్ల సంఖ్య 2,740కి చేరింది. ప్రింటింగ్ టెక్నాలజీ అండ్ డాటా అనలటిక్స్ కోర్సులో ఇప్పటి వరకు 60 సీట్లు మాత్రమే ఉండగా, మరో 60 సీట్లను పెంచుతున్నారు.
ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజినీరింగ్ కోర్సులోనూ 120 సీట్లను అదనంగా చేర్చుతున్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్(ఈసీ) విభాగంలో 60, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికిల్ టెక్నాలజీ(ఈఈవీ) కోర్సులో 360, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్(ఈఈ)లో 180, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అండ్ సెక్యూరిటీ (సీపీఎస్)లో 60, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్డాటా(సీసీబీ)లో 120, కెమికల్ ఇంజినీరింగ్లో 60, ఏఐఎంఎల్లో 540 చొప్పున సీట్లను పెంచారు. ఈ కొత్త సీట్లకు అనుమతి కోరుతూ ఏఐసీటీఈకి దరఖాస్తు చేశారు.