కార్పొరేషన్ (కరీంనగర్), ఫిబ్రవరి 10: ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు కరీంనగర్లో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ పత్రికలు సంయుక్తంగా నిర్వహించిన ప్రాపర్టీషో గ్రాండ్ సక్సెస్ అయింది. కలెక్టరేట్ ఎదుట రెవెన్యూ గార్డెన్లో రెండ్రోజులపాటు కొనసాగిన ఈ ప్రదర్శనలో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు, బ్యాంకులు ఏర్పాటు చేసిన స్టాళ్లకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన 1,200 మందికిపైగా ప్రజలు ఈ స్టాళ్లను సందర్శించారు. వివిధ ప్రాంతాల్లోని వెంచర్లు, అపార్ట్మెంట్లు, ఇండ్లు, ఇండ్ల స్థలాల వివరాలతోపాటు వాటి కొనుగోలుకు బ్యాంకర్లు కల్పిస్తున్న రుణ సదుపాయాల గురించి తెలుసుకున్నారు. వారిలో కొందరు అక్కడికక్కడే ఇండ్లు, ప్లాట్లను బుక్ చేసుకుని, అడ్వాన్సులు చెల్లించారు.
శనివారం ముగింపు కార్యక్రమానికి కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్, కేడీసీసీబీ సీఈవో సత్యనారాయణరావు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్థిరాస్తుల కొనుగోలుకు ఎంతో ఉపకరిస్తున్న ఇలాంటి ప్రాపర్టీషోలను మళ్లీ మళ్లీ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ ప్రదర్శనను నిర్వహించిన ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ పత్రికలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ‘నమస్తే తెలంగాణ’ కరీంనగర్ బ్రాంచి మేనేజర్, బ్యూరో ఇన్చార్జి కే ప్రకాశ్రావు, యాడ్స్ మేనేజర్ రేణ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.