కరీంనగర్ కార్పొరేషన్, ఫిబ్రవరి 9: ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు తరచుగా స్థిరాస్తి ప్రదర్శనలు నిర్వహిస్తున్న ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ పత్రికలు తాజాగా మరో ప్రాపర్టీ షోకు తెర లేపాయి. కరీంనగర్లోని కలెక్టరేట్కు ఎదురుగా రెవెన్యూ గార్డెన్లో ఏర్పాటు చేసిన ఈ ప్రాపర్టీషోను మాజీ ఎంపీ వినోద్కుమార్, నాఫ్స్కాఫ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్రావు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్కు చెందిన పలు ప్రముఖ సంస్థలతోపాటు జిల్లాకు చెందిన వివిధ రియల్ ఎస్టేట్ సంస్థలు, బిల్డర్లు, బ్యాంకర్లు, సోలార్ సంస్థలు ఈ ప్రదర్శనలో స్టాళ్లను ఏర్పాటు చేశాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ స్టాళ్లను సందర్శించి వివిధ రియల్ ఎస్టేట్ సంస్థల వెంచర్లు, ఇండ్లు, స్థలాలతోపాటు వాటి కొనుగోలుకు బ్యాంకులు కల్పిస్తున్న రుణ సదుపాయాల గురించి తెలుసుకున్నారు. దీంతో తొలి రోజే ఈ ప్రాపర్టీషో గ్రాండ్ సక్సెస్ అయ్యింది. కార్యక్రమంలో కేడీసీసీబీ ఉపాధ్యక్షుడు పింగళి రమేశ్, ‘నమస్తే తెలంగాణ’ అడ్వైర్టెజ్మెంట్ జీఎం ఎన్ సురేందర్రావు, ఏజీఎం రాజిరెడ్డి, కరీంనగర్ బ్రాంచి మేనేజర్, బ్యూరో ఇన్చార్జి కే ప్రకాశ్రావు, యాడ్స్ మేనేజర్ రేణ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
స్థిరాస్తి కొనుగోలుదారుల సౌలభ్యం కోసం ‘నమస్తే తెలంగాణ, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రాపర్టీషోలను నిర్వహిస్తున్నాం. గతంలో విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలు హైదరాబాద్ లాంటి నగరాలకే పరిమితమయ్యేవి. ప్రస్తుతం ప్రజల అభిరుచులు మారడంతో జిల్లా స్థాయిలోనూ అత్యాధునిక సౌకర్యాలతో కూడిన విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలపై ఆసక్తి చూపుతున్నారు. వారి సౌలభ్యం కోసం పలు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలతోపాటు నిర్మాణ రంగానికి సంబంధించిన వివిధ కంపెనీలు, బ్యాంకర్లను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఈ ప్రాపర్టీషోను ఏర్పాటు చేశాం. దీనిని జిల్లా ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం.
– ఎన్ సురేందర్ రావు, నమస్తే తెలంగాణ అడ్వైర్టెజ్మెంట్ జనరల్ మేనేజర్