ఖమ్మం సిటీ, మార్చి 11: ఖమ్మంలోని భూదాన్ భూముల బాధితులకు వెన్నుదన్నుగా నిలిచింది ‘నమస్తే తెలంగాణ’. వెలుగుమట్లలో పేదల గుడిసెలు కూల్చిన నాటి నుంచి వారి సమస్యను సమాజం దృష్టికి తీసుకొనిరావడంలో కీలకపాత్ర పోషించింది. బాధితులు అనుభవిస్తున్న వెతలు, ఆర్తనాదాలను వెలుగులోకి తెచ్చి, వారికి కొండంత అండగా నిలిచింది. వెలుగుమట్ల వ్యవహారం రెండు మూడు రోజుల్లో సర్దుకుంటుందిలే అని భావించిన కాంగ్రెస్ పాలకులకు బీఆర్ఎస్ పార్టీ కూడా కంటిమీద కునుకులేకుండా చేసింది. వెలుగుమట్ల బాధితులను పరామర్శించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రావడంతో నిరాశ్రయుల అరిగోస జాతీయస్థాయిలో చర్చకు దారితీసింది.
అదే సమయంలో ‘నమస్తే తెలంగాణ’ పత్రిక కూడా బాధితుల కష్టాలకు అక్షరరూపమిచ్చింది. భూదాన్ భూముల్లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ నేతల గారడీలు, అధికారుల అకృత్యాలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకొచ్చింది. కొన్ని మీడియా సంస్థలు సమస్యను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించగా, ‘నమస్తే తెలంగాణ’ మాత్రం బాధితుల పక్షాన నిలబడింది. ప్రభుత్వ పెద్దలు పత్రికపై అక్కసు వెళ్లగక్కినా, హెచ్చరికలు జారీచేసినా ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. దినదినగండంగా బతుకుతున్న బీదలకు వెన్నుదన్నుగా నిలిచింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇండ్ల స్థలాల పట్టాలు ఇచ్చేంత వరకు అలుపెరుగని అక్షర పోరాటం చేసింది. బుధవారం ఖమ్మం కలెక్టరేట్లో దాదాపు 400 పైచిలుకు నిరుపేద కుటుంబాలకు ఇండ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారంటే అందులో ‘నమస్తే తెలంగాణ’ పాత్ర క్రియాశీలకమని పలువురు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. కాగా, భూదాన్ బాధితుల్లో ఎవరిని పలుకరించినా.. ‘నమస్తే తెలంగాణ’ సాగించిన అక్షర పోరాటంతోపాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కృషి గురించే చెప్తున్నారు. కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు ఖమ్మం నగరానికి రాకపోయి ఉంటే తమ బతుకులు మరింత ఆగమయ్యేవని అంటున్నారు.
‘పువ్వాడ ఫౌండేషన్’ బాధ్యులతోపాటు మరికొంతమంది బీఆర్ఎస్ నాయకులు లేకపోతే తాము పస్తులతోనే కన్నుమూసే వారమని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వారికి జన్మజన్మలా రుణపడి ఉంటామని చేతులెత్తి నమస్కరిస్తున్నారు. తమపక్షాన నిలబడి పోరాడిన ‘నమస్తే తెలంగాణ’, ‘టీ న్యూస్’ సంస్థలకు రుణపడి ఉంటామంటూ ఆనంద బాష్పాలు రాలుస్తున్నారు. తమ వేదన, రోదన, కన్నీటి గోసను బయటి ప్రపంచానికి తెలియజేయడంలో ఆ రెండు సంస్థలు చాలా గొప్పగా వ్యవహరించాయని కితాబిస్తుండటం విశేషం.