హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలశాఖ ఫొటోగ్రఫీ కాంపిటిషన్ నిర్వహించింది. బం గారు తెలంగాణ, పల్లె- పట్టణ ప్రగతి, ఉత్తమ వార్తాచిత్రం, పట్టణ- గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, సైలైన్ ఆఫ్ హైదరాబాద్ పేరుతో మొత్తం ఐదు విభాగాల్లో ఫొటో కాంపిటిషన్కు ఎంట్రీలను ఆహ్వానించింది. రాష్ట్రవ్యాప్తంగా 96 మంది ఫొటోగ్రాఫర్లు 1,200 ఫొటోలను పోటీలకు పంపారు. జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కళాశాల రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఎం నాగరాజ, సీనియర్ జర్నలిస్టు డాక్టర్ గోవిందారాజు చక్రధర్, హిందూ దినపత్రిక మాజీ చీఫ్ ఫొటోగ్రాఫర్ హెచ్ సతీశ్ సభ్యులుగా ఉన్న కమిటీ ఎంట్రీలను పరిశీలించి విజేతలను ఎంపిక చేసింది.
విభాగాలవారీగా మొద టి బహుమతి రూ.20,000, ద్వితీయ బహుమతి రూ.15,000, తృతీయ బహుమతి రూ.10,000 లతోపాటు కన్సొలేషన్ బహుమతులు రూ.5,000 ప్రకటించింది. ఈ నెల 25న విజేతలకు బహుమతులతోపాటు ధ్రువీకరణ పత్రాలు అందజేస్తామని సమాచార, పౌరసంబంధాలశాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దినపత్రికల ఫొటోగ్రాఫర్లకు ఐదు విభాగాల్లో ఏడు అవార్డులు వరించాయి. వీరగోని రజినీకాంత్గౌడ్ (హైదరాబాద్)కు ప్రథమ బహుమతితోపాటు కన్సొలేషన్ బహుమతికి ఎంపికయ్యారు. గొట్టె వెంకన్న (వరంగల్)కు తృతీయ, ఎం గోపీకృష్ణ (హైదరాబాద్)కు కన్సొలేషన్, గడసంతల శ్రీనివాస్ (హైదరాబాద్)కు కన్సొలేషన్, పీ సైదిరెడ్డి (సూర్యాపేట)కి కన్సొలేషన్, సూర్య శ్రీధర్ (తెలంగాణ టుడే హైదరాబాద్)కు కన్సొలేషన్ బహుమతులకు ఎంపికయ్యారు.