ఖలీల్వాడి/ కంఠేశ్వర్, ఫిబ్రవరి 10: వాహన ప్రేమికుల కోసం నిజామాబాద్లోని పాత కలెక్టరేట్ మైదానంలో ఆటోషో ఏర్పాటైంది. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ పత్రికల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను జడ్పీ దాదన్నగారి విఠల్రావు, నిజామాబాద్ మేయర్ నీతూ కిరణ్, సీనియర్ మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ యశ్వంత్ కుమార్, ఎంవీఐ కిరణ్, ‘నమస్తే తెలంగాణ’ ప్రకటనల విభాగం జనరల్ మేనేజర్ ఎన్ సురేందర్రావు శనివారం ప్రారంభించారు.
మెర్సిడెస్ బెంజ్, ఆడీ, వోల్వో లాంటి అంతర్జాతీయ కంపెనీలతోపాటు పలు దేశీయ ఆటోమొబైల్ కంపెనీలు, బ్యాంకర్లు ఈ ప్రదర్శనలో తమ స్టాళ్లను ఏర్పాటు చేశాయి. సామాన్యుల నుంచి కోటీశ్వరుల వరకు అందరినీ ఆకట్టుకునేలా ఈ ఆటోషోలో వివిధ రకాల అత్యాధునిక వాహనాలు కొలువుదీరాయి.
ఎలక్ట్రిక్ వాహనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీంతో తొలి రోజే ఈ ప్రదర్శన కిటకిటలాడింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన సందర్శకులు ఆయా స్టాళ్ల వద్దకు వెళ్లి వాహనాల వివరాలు, వాటి కొనుగోలుకు బ్యాంకర్లు కల్పిస్తున్న రుణ సదుపాయాల గురించి తెలుసుకున్నారు. కొందరు సందర్శకులు అక్కడికక్కడే వాహనాలను బుక్ చేసుకున్నారు.
కియా బంపర్ ఆఫర్
గతేడాది నిజామాబాద్లో కియా కంపెనీ డీలర్షిప్ను పొందిన సన్రైజ్ కియా యాజమాన్యం ఈ ఆటోషోలో బంపర్ ఆఫర్ను ప్రకటించింది. కియా ‘సెల్టోస్’ మాడల్ను బుక్ చేసుకున్నవారిని ఉచితంగా విదేశీ ట్రిప్కు పంపుతామని, దంపతులిద్దరికీ ఈ అవకాశం కల్పిస్తామని సన్రైజ్ కియా మేనేజింగ్ డైరెక్టర్ రవికిరణ్గౌడ్ తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ హెడ్ శంకర్ హెంబ్రమ్, ‘నమస్తే తెలంగాణ’ యూనిట్ మేనేజర్ గడ్డి ధర్మరాజు, ఎడిషన్ ఇన్చార్జి లక్మా రమేశ్, బ్యూరో చీఫ్ జూపల్లి రమేశ్, యాడ్స్ మేనేజర్ శ్రీకాంత్, ఏజీఎం రాజిరెడ్డి, సర్క్యులేషన్ ఏసీఎం సునీల్ తదితరులు పాల్గొన్నారు.
ముచ్చటగా మూడోసారి
నిజామాబాద్లో మేము గతంలో రెండుసార్లు నిర్వహించిన వాహన ప్రదర్శనలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించడంతో ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఆటోషోను ఏర్పాటు చేశాం. ఇక్కడి ప్రజల అభిరుచులకు తగ్గట్టుగా ప్రీమియం బ్రాండ్ల కార్లతోపాటు అనేక కంపెనీల వాహనాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం.
– ఎన్ సురేందర్రావు, నమస్తే తెలంగాణ ప్రకటనల విభాగం జనరల్ మేనేజర్