నిజామాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నిజామాబాద్లో నిర్వహించిన నిపుణ ‘కొలువు.. గెలువు’ అవగాహన సదస్సుకు విశేష స్పందన లభించింది. స్థానిక రాజీవ్గాంధీ ఆడిటోరియంలో జరిగిన సదస్సుకు టీఎస్పీఎస్సీ, పోలీస్ నియామక పరీక్షలకు సన్నద్ధమవుతున్న ఉద్యోగార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నిజామాబాద్ కలెక్టర్ సీ నారాయణరెడ్డి, పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజు ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.
పోటీ పరీక్షల్లో ఏ విధంగా రాణించాలన్న అంశాలపై సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ మల్లవరపు బాల లత, వేప అకాడమీ డైరెక్టర్ డాక్టర్ సీఎస్ వేప అభ్యర్థులకు అవగాహన కల్పించారు. నమస్తే తెలంగాణ చీఫ్ ఆఫ్ న్యూస్బ్యూరో ఓరుగంటి సతీశ్, తెలంగాణ పబ్లికేషన్స్ మేనేజర్ టీ గణేశ్, నిజామాబాద్ ఎడిషన్ ఇంచార్జి లక్మ రమేశ్, బ్యూరోచీఫ్ జూపల్లి రమేశ్, ప్రకటనల విభాగం మేనేజర్ శ్రీకాంత్, సర్క్యులేషన్ ఏసీఎం నాగస్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మూడున్నర గంటల పాటు ఏకధాటిగా సాగిన నిపుణుల ప్రసంగాలను అభ్యర్థులు ఆసక్తిగా ఆలకించారు. ముఖాముఖి కార్యక్రమంలో వక్తలను ప్రశ్నలు అడిగి తమ సందేహాలను నివృత్తి చేసుకొన్నారు.
ప్రతి నిమిషమూ ముఖ్యమే: కలెక్టర్
పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ప్రిపరేషన్పైనే దృష్టి నిలపాలని నిజామాబాద్ కలెక్టర్ సీ నారాయణరెడ్డి సూచించారు. ప్రతి నిమిషాన్నీ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉద్యోగార్థులకు ‘నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే’ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుండటం అభినందనీయమన్నారు. అభ్యర్థులు కష్టాన్నే నమ్ముకోవాలని నిజామాబాద్ సీపీ కేఆర్ నాగరాజు సూచించారు. కేసీఆర్ ప్రభుత్వం మెగా నోటిఫికేషన్ విడుదల చేస్తున్న తరుణంలో అభ్యర్థులకు అవసరమైన అవగాహన సదస్సులు నిర్వహించడం ‘నమస్తే తెలంగాణ’ సామాజిక బాధ్యతగా భావిస్తున్నదని నమస్తే తెలంగాణ రాష్ట్ర చీఫ్ బ్యూరో ఓరుగంటి సతీశ్ తెలిపారు. తెలంగాణ వచ్చాక పరిస్థితులు మారిపోయాయన్నారు. తాజాగా కేసీఆర్ ప్రభుత్వం 80 వేల ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లు ఇచ్చిందని తెలిపారు.