హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ):తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన చరిత్రకు, సంస్కృతికి సాక్షీభూతంగా నిలిచిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ఒక ప్రశ్నకు ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకొని మాట్లాడారు. ‘ఈరోజు పత్రికలో చదివిన. మగధ సామాజ్య్రం ఏ విధంగా ఉండెనో మన శాతవాహనుల సామాజ్య్రం ఆదే విధంగా ఉండేది. మన కోట లింగాల కూడా అంతే వైభవంగా ఉండెనని ఇప్పుడు నూతన చరిత్ర పరిశోధకులు పరిశోధనలు చేసి.. ఆ శాసనాలను వెలికి తీస్తున్నరు. ఇవన్నీ ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉన్నది’ అని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో పాత రాతి యుగం నాటి నుంచి ఆధునిక కాలం దాకా పరిఢవిల్లిన చరిత్ర, సంస్కృతి, జన జీవనంపై ప్రఖ్యాత ఆర్కియాలజిస్టు డాక్టర్ ఎంఏ శ్రీనివాసన్.. సాధికారిక ఆధారాలతో, హేతుబద్ధంగా విశ్లేషిస్తూ పరిశోధనాత్మకంగా రాస్తున్న వ్యాసాలను ‘నమస్తే తెలంగాణ’ ప్రతి సోమవారం ధారావాహికంగా ప్రచురిస్తున్నది. ఈ కథనాల గురించి ముఖ్యమంత్రి సోమవారం శాసనసభలో పరోక్షంగా ప్రస్తావించారు. మన ఘనమైన చరిత్రను పరిరక్షించుకోవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.