హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): ‘ఇదేమైనా బంతి భోజనమా? అందరికీ ఒకేసారి ఎలా ప్రమోషన్లు వస్తయ్? మే ము ఉన్నాముగా.. వచ్చే దఫాలో ఇప్పిస్తాం లే!’ ఈ మాటలన్నదెవరో కాదు. అడ్డదారిలో ఉద్యోగోన్నతులు పొందేందుకు ప్రయత్నిస్తున్న ఓ ఉద్యోగ సంఘం నేత. ‘అన్నా మాకు ప్రమోషన్లు వస్తలేవు. జర ఇప్పించమంటూ కొంద రు బాధిత ఎంపీడీవోలు అడగడంతో వారిపై సదరు నేత చిర్రుబుర్రులాడారట. అంతటితో ఆగకుండా ‘బంతి భోజనమా? అంటూ ఫైర్ అయ్యారట. కొట్లాడి మాకు పదోన్నతు లు ఇప్పించాల్సింది పోయి.. మీరే పంచుకుంటే ఎట్లా ..? అంటూ బాధితులు అడిగితే ఇప్పిస్తాంలే అని రుసరుసలాడారట. దీనిపై కొందరు ఎంపీడీవోలు మండిపడుతున్నారు.
ప్రభుత్వ యంత్రాంగంలో కీలకమైన మండల పరిషత్ అభివృద్ధి అధికారుల (ఎంపీడీవో) ఉద్యోగోన్నతుల వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అర్హత కలిగిన అధికారులను పకనబెట్టి, నిబంధనలకు విరుద్ధంగా ప్రమోషన్లు కల్పిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కొందరు ఉద్యోగ సంఘాల నేతల తీరుపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదుల సంఖ్యలో కేసులు ఉన్నప్పటికీ ప్రమోషన్ల జాబితాలో ప్రథమస్థానంలో ఉన్న ఉద్యోగ సంఘాల నాయకుడు ఇలా నీతులు చెప్పడంపై ప్రమోషన్లకు అర్హులైన బాధిత ఎంపీడీవోలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు తొమ్మిది మంది అధికారులపై తీవ్రమైన కేసులు ఉన్నప్పటికీ, వారి పేర్లను లిస్టులో చేర్చారని బాధితులు ఆరోపిస్తున్నారు. 19 ఏండ్లు సర్వీసు పూర్తిచేసి కెరీర్లో ఎలాంటి రిమార్కులు లేకుండా ఉన్న అర్హులైన తమను కాదని, తీవ్రమైన కేసులు ఉన్నా, ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్న ఉద్యోగ సంఘాల నేతలు, వాళ్లు చెప్పే అనుయాయులకు దొడ్డిదారిన ప్రమోషన్లు కల్పించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
గత కేసీఆర్ పాలనలో రెండు దఫాలుగా భారీ సంఖ్యలో ప్రమోషన్లు ఇచ్చారు. అప్పు డు సీనియారిటీ ప్రాతిపదికన అందరికీ న్యా యం జరిగిందని పలువురు ఎంపీడీవోలు గుర్తు చేస్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వానికి కొమ్ముకాసే వ్యక్తులకు, తీవ్రమైన కేసులు ఉన్న వారికి కూడా ఉద్యోగోన్నతులు కట్టబెడుతున్నారని ఆరోపిస్తున్నారు. ప్ర మోషన్ల లిస్టులో అనేక అక్రమాలు ఉన్నట్టు స్పష్టమవుతున్నదని ఆరోపించారు. ఉత్తర్వు లు రాకముందే ప్రమోషన్లు వచ్చినట్లు ప్రచా రం చేసుకుంటున్నా సర్కార్కు చీమకుట్టినైట్లెనా లేకపోవడం బాధాకరమంటున్నారు.
ఉద్యోగోన్నతుల వ్యవహారంపై ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఎంపీడీవోల గ్రూపుల్లో కలకలం రేపింది. ఒకవైపు అర్హులైన ఎంపీడీవోలు తమకు జరుగుతున్న అన్యాయంపై మండిపడుతుంటే, మరోవైపు కొందరు ఉద్యోగ సంఘాల నేతలు ఈ అక్రమాలను సమర్థిస్తూ చిలుక పలుకులు పలుకుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ‘నిజాయితీగా పనిచేసే అధికారులను పకనబెట్టి, పదుల సంఖ్యలో కేసులు ఉన్న వారికి, నిబంధనలకు విరుద్ధంగా ప్రమోషన్లు కల్పించడం ఏ రాజ్యాంగంలో ఉంది?’ అని ఒక బాధిత ఎంపీడీవో ప్రశ్నించారు. ఈ అక్రమ పదోన్నతులపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, సీనియారిటీ, క్లీన్ రికార్డు ఉన్న వారికే ప్రాధాన్యం ఇవ్వాలని ఎంపీడీవోలు డిమాండ్ చేస్తున్నారు.