మహబూబ్నగర్, ఫిబ్రవరి 17: సంకల్పం బలంగా ఉన్నప్పుడు ఎదుగుదలను ఎవరూ ఆపలేరని కేఎల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ప్రశాంత్ అన్నారు. ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని వాటికి అనుగుణంగా అడుగులు వేయాలని సూచించారు. మరింత మంచి లైఫ్కు గైడ్గా కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులకు తోడుంటుందని చెప్పారు.
శనివారం ‘నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే’, కేఎల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ‘ఇంటర్ తర్వాత ఉన్నత విద్యా అవకాశాలు’ అనే అంశంపై ‘లక్ష్యం-2024’ పేరిట విద్యార్థులకు అవగాహన సదస్సును మహబూబ్నగర్లోని క్రౌన్ గార్డెన్లో నిర్వహించారు. ఈ సదస్సుకు వాగ్దేవి కళాశాల విద్యార్థులు 500 మందికిపైగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ ప్రశాంత్ మాట్లాడుతూ.. మెరిట్ స్టూడెంట్స్కు రూ. 100 కోట్ల స్కాలర్షిప్లను కేఎల్ యూనవర్సిటీ అందిస్తుందని చెప్పారు. రూ.60 లక్షల వార్షిక ప్యాకేజీతో యూనివర్సిటీ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు వచ్చినట్టు తెలిపారు. దేశ, విదేశాల్లోనూ కేఎల్ యూనివర్సిటీకి 70 నుంచి 80 యూనివర్సిటీల్లో అనుబంధం ఉన్నదని, వారితో ప్రత్యేకంగా సంప్రదింపులు జరిపి ఉద్యోగ అవకాశాలను అందుబాటులో ఉంచే బాధ్యత తీసుకోవడం జరుగుతుందని చెప్పారు.
నాలుగేండ్లు కష్టపడితే చాలు..
నాలుగేండ్లు కష్టపడి చదివితే జీవితంలో స్థిరపడతారని కేఎల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గీత సూచించారు. వాగ్దేవి జూనియర్ కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. సమయాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వృథా చేయొద్దని సూచించారు. అనంతరం ఇంటర్ మొదటి సంవత్సరంలో మంచి మార్కులు సాధించిన వారికి కేఎల్ యూనివర్సిటీ బహుమతులు ప్రదానం చేసింది. ఈ కార్యక్రమంలో ‘నమస్తే తెలంగాణ’ బ్రాంచి మేనేజర్ రాజశేఖర్, అడ్వర్టైజ్మెంట్ మేనేజర్ విజయ్కుమార్రెడ్డి, యాంకర్ ఆదిత్య, కేఎల్ యూనివర్సిటీ మేనేజర్లు వెంకటేశ్, నరేశ్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.