హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు కేంద్రియ విద్యాలయాల మంజూరులో కేంద్ర ప్రభుత్వ వివక్షపై లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఐదేండ్లలో తెలంగాణలో ఒక కేంద్రియ విద్యాలయాన్ని కూడా ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ఐదేండ్లలో దేశవ్యాప్తంగా ఎన్ని కేంద్రియ విద్యాలయాలు ఏర్పాటు చేశారు? రెగ్యులర్ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నాయో చెప్పాలని కోరారు.
దేశవ్యాప్తంగా 2018-19లో 16, 2019-20లో 36, 2020-21లో 10, 2021-22లో 3, 2022-23లో 5 కేంద్రియ విద్యాలయాలు ప్రారంభించి, తెలంగాణను పూర్తిగా విస్మరించడమేమిటని నిలదీశారు. కేంద్రియ విద్యాలయాల్లో టీచింగ్ పోస్టులు 13,562, నాన్ టీచింగ్ పోస్టులు 1,772 ఖాళీగా ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయడంతోపాటు తెలంగాణలో నూతనంగా కేంద్రియ విద్యాలయాలను ఏర్పాటుచేసి, పేద విద్యార్థులకు విద్యను అందుబాటులో ఉంచాలని కోరారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి సమాధానం ఇస్తూ ఖాళీల భర్తీకి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.