హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): చేనేతపై జీఎస్టీ ఎత్తివేసి, నేత కార్మికులకు నేషనల్ హ్యాండ్లూమ్ పాలసీ ప్రకటించాలని బీఆర్ఎస్ లోక్సభాపక్ష నాయకుడు నామా నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సోమవారం న్యూఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్లో అఖిల భారత పద్మశాలి సంఘం హ్యాండ్లూమ్ విభాగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలోఎంపీ నామా ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. చేనేత కార్మిక కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. చేనేతల అభివృద్ధికి తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తూ పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ ఎత్తివేయాలని కేంద్రాన్ని కోరడంతోపాటు పోచంపల్లిలో మూతబడిన చేనేత పార్ను తిరిగి ఏర్పాటుచేసేందుకు కేటీఆర్ కేంద్రానికి పలు లేఖలు రాసిన సంగతిని నామా గుర్తు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీలు శశి థరూర్, కార్తీ చిదంబరం, వివేక్ తన్ఖా, ఉత్తమ్కుమార్రెడ్డి, బిజూ జనతా దళ్ ఎంపీ అమర్ పట్నాయక్, ప్రముఖ పాత్రికేయుడు ఎస్ వెంకట్నారాయణ, సినీ నటి, సామాజిక కార్యకర్త పూనమ్కౌర్, అఖిల భారత పద్మశాలి సంఘం, చేనేత విభాగం అధ్యక్షులు కందగట్ల స్వామి, ఎర్రమాద వెంకన్న, యువజన విభాగం ఇన్చార్జి అవ్వారి భాసర్, ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం, మహిళా విభాగం అధ్యక్షురాలు వనం దుష్యంతలతోపాటు దాదాపు 14 రాష్ర్టాల నుంచి పద్మశాలి సంఘాల నేతలు పాల్గొన్నారు.