నాంపల్లి : భారత ప్రధాన న్యాయమూర్తి , జాతీయ న్యాయ సేవాధికార సంస్థ (నల్సా) ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ ఎన్వీ రమణ ఆదేశాల మేరకు పేద ప్రజలకు ఉచిత న్యాయం అందించేందుకు పాన్-ఇండియా అవేర్నెస్ అండ్ అవుట్రీచ్ క్యాంపెయిన్ను రూపొందించారు.దేశంలోని సుదూర ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు న్యాయశాస్త్రంపై అవగాహన కల్పించడం కార్యనిర్వాహక చైర్మన్ జస్టిస్ యు.యు. లలిత్ రూపొందించిన ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.
మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు 2 ఉదయం 11 గంటలకు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఈ క్యాంపెయిన్ను ప్రారంభించారు. ఇది 2021 నవంబర్ 14 వరకూ కొనసాగనుంది. ఈ సంవత్సరం భారతదేశం 75 వ స్వాతంత్ర్య దినోత్సవంతోపాటు “ఆజాది కా అమృత్ మహోత్సవ్” కూడా జరుపుకుంటోంది. అలాగే నల్సా ప్రారంభమై ఈ ఏడాదికి 25 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ క్రమంలో భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 45 రోజుల పాటు సాగే ఈ క్యాంపెయిన్ ఆయన చేతులమీదుగా ప్రారంభమైంది.
ఈ కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర న్యాయ శాఖ మంత్రి, నల్సా కార్యనిర్వాహక ఛైర్మన్తోపాటు సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మెట్రోపాలిటన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఏర్పాటు చేసిన బృందాలు చింతలబస్తీ, సైదాబాద్, ఖైరతాబాద్, ఎస్ఆర్ నగర్, మలక్పేట్, సనత్నగర్, బంజారాహిల్స్, చంపాపేట్, లాలాపేట్లో క్యాంపింగ్ నిర్వహించాయి. అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో, చంచల్గూడ జైల్లో న్యాయ విజ్ఞానంపై అవగాహనఆ కార్యక్రమాలను నిర్వహించాయి.