హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): నల్లా కనెక్షన్లు ఇవ్వడంలోనూ దేశంలో దళితులపై వివక్ష కొనసాగుతున్నది. పార్లమెంట్ వేదికగా కేంద్రమే ఈ విషయాన్ని వెల్లడించింది. అందులోనూ బీజేపీ రాష్ర్టాలే ముందువరుసలో ఉండటం గమనార్హం. దేశంలో దళితుల ఆవాసాలకు నల్లా కనెక్షన్లు ఇవ్వడంలో వివక్ష చూపుతున్నారా? అలాంటి సంఘటనలు కేంద్రం దృష్టికి వచ్చాయా? దేశంలోని ఎన్ని ఎస్సీ ఆవాసాలకు నల్లా నీటి కనెక్షన్లు ఉన్నాయి? అని పార్లమెంట్లో తమిళనాడుకు చెందిన ఎంపీ డీ రవికుమార్ ప్రశ్నించగా, కేంద్ర జల్శక్తి సహాయ మంత్రి ప్రహ్లాద్సింగ్పటేల్ సమాధానమిచ్చారు. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ ఆవాసాలతో సహా ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్లు ఇవ్వాలనే లక్ష్యంతో జల్జీవన్ మిషన్ (హర్ ఘర్ జల్) పథకాన్ని 2019లో కేంద్రం చేపట్టిందని చెప్పారు. నిర్దేశిత లక్ష్యంలో 58.77% మేర కనెక్షన్లు పూర్తయ్యాయని వెల్లడించారు. ఎస్సీ ఆవాసాలకు నల్లా కనెక్షన్లకు సంబంధించిన రికార్డులను కేంద్రం నిర్వహించడం లేదని, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే ఉన్నాయని తెలిపారు. ఇప్పటివరకు దేశంలో ఎస్సీ ఆవాసాలకు ఇచ్చిన నల్లా కనెక్షన్లకు సంబంధించి ఆయా రాష్ర్టాలు అందజేసిన వివరాలను పార్లమెంట్కు కేంద్రం నివేదించింది. ఇందులో దేశంలో పెద్ద రాష్ర్టాలుగా ఉన్న ఏ ఒక్క రాష్ట్రంలో కూడా 100% ఎస్సీ ఆవాసాలకు నల్లా కనెక్షన్లు ఇవ్వకపోవడం గమనార్హం. తెలంగాణలో మాత్రం 100% ఎస్సీ ఆవాసాలకు నల్లా కనెక్షన్లు పూర్తయ్యాయి.
పూర్తిగా ఎస్సీలే ఉన్న ఆవాసాలకు 100% నల్లానీటిని అందిస్తున్న రాష్ర్టాలు తెలంగాణ, గుజరాత్, హర్యానా, హిమాచల్ప్రదేశ్, పంజాబ్.