ఒకప్పుడు ఊళ్లల్లో ఎన్నో ఇండ్లకు చేతిపంపే చిరునామా. ఈ చేతిపంపులే నల్లగొండకు శాపం. పాతాళానికిపోయి గంగనే కాదు విషపు ఫ్లోరైడ్నీ ఎత్తుకొచ్చాయి. అయిదు దశాబ్దాల పోరాటం ఫలించలేదు. మూడు తరాలు ఫ్లోరైడ్కు బలైపోయాయి.
కేసీఆర్ ఈ ఎడారి పల్లెల్లో ఫ్లోరైడ్ పోరుయాత్ర నడిపిండు. తెలంగాణ తెచ్చి, తలాపున ఉన్న నీళ్లను భగీరథునిలా తరలించిండు. నల్లగొండను శాపవిముక్తి చేసిండు.
భగీరథ నీళ్ల రాకతో ఆనాటి చేతిపంపుల అడ్రస్ గల్లంతైంది. గులాబీ జెండా ఎత్తినందుకు, కేసీఆర్ పాలకుడైనందుకే ఫ్లోరైడ్ నుంచి విముక్తి కలిగిందంటున్నాయి మునుగోడు పల్లెలు.
నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: ఒకప్పుడు ఫ్లోరైడ్ విషపు నీళ్లే నల్లగొండ ప్రజలకు ఆధారం. తెలియక కొంతకా లం, తప్పక మరికొంత కాలం తాగి ఎన్ని జీవితాలు తెల్లారిపోయినయో. ఎంత దుఃఖం.. పాలకుల నిర్లక్ష్యం మూడు తరాలను బలితీసుకున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3400కుపైగా ఆవాసాలున్నాయి. వాటిలో ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలు మూడు వేలకు ఎక్కువే. జిల్లాలో 16 లక్షల మంది ఫ్లోరోసిస్ బాధితులున్నారు. ఒళ్లు నొప్పులు, కండరాలుపట్టేయడం, కాళ్లు చేతులు వంకర్లు, ఎదుగుదల లేకపోవడం ఇంకా ఎన్నో సమస్యలు.
మంచినీళ్ల కోసం ఎన్నో పోరాటాలు చేసినా ఫలితం రాలేదు. అడుగంటుతున్న జలాల కోసం భూమి పొర ల్లో లోలోతులకు పోతూ పాతాళ గంగను ఎత్తుకొచ్చారు. బోరు ఎంత లోతుకు పోతే అంత ఎక్కువ ఫ్లోరైడ్ నీటిని గుంజుకొచ్చింది. ఆ విషపు నీళ్లు తాగి ఇక్కడి బతుకులన్నీ ఆగమాగమయ్యాయి. అయినా ఊరు విడిచి పోలేక. జీవచ్ఛవాల్లా బతికారు ఇక్కడి జనాలు. దశాబ్దాల ఉద్యమ ఆకాంక్ష మంచినీళ్లు, సాగునీళ్లు. ఈ రెంటినీ తెలంగాణ సర్కారు సాకారం చేసింది. మిషన్ కాకతీయ చెరువులకు జలకళ తెచ్చింది. భూగర్భ జలమట్టం పెరిగి ఊరట నిచ్చింది. మిషన్ భగీరథ నీళ్లు ఇంటింటికీ వచ్చాయి. ఫ్లోరైడ్ పీడ తప్పింది. ఇప్పుడిప్పుడే ఫ్లోరోసిస్ సమస్యలూ తగ్గుతున్నాయి. పల్లెల్లో ఇంటింటికీ మంచినీళ్లొచ్చినంక విషపు బోర్లు బందు పెట్టారు. అవసరం లేని బోర్లు మునుగోడు పల్లెల్లో అప్పుడే కనుమరుగైపోయాయి. అయిదు దశాబ్దాల నుంచి ఆ బోరు నీళ్లపైనే ఆధారపడ్డ జనం ఇప్పుడు మిషన్ భగీరథ నీళ్లు తాగుతూ ఆనందంగా ఉంటున్నారు. అవసరం లేని బోర్లు ఎందుకని వీధుల్లో వాటిని తొలగించారు.
బోరుని బందువెట్టినం
మా కాలనీల రెండు వందల అడుగుల లోతు బోరు వేశారు. ఈ చేతిపంపు నీళ్లు ఇరవై ఏండ్లకు ఎక్కువే తాగినం. కాళ్లు చేతులు పోయినయ్. నడుములు పోయినయ్. మెడలు పోయినయ్. వళ్లు నొప్పులు ఇప్పటికీ ఉన్నయ్. దీని నీళ్లు తాగి రోగం రానోళ్లు లేరు. అందరికీ కాళ్ల నొప్పులు. లేవొస్తలేదు. ఫిల్టర్ పెట్టిన్రు. నెల రోజులు వాడినం. బాగలేకుంటే బందు పెట్టినం. అయిదేండ్ల నుంచి భగీరథ నీళ్లొస్తున్నయ్. అప్పటి నుంచి ఈ బోరుని బందు పెట్టినం.
– ఆండాల్, నామాపురం, మర్రిగూడ మండలం
మర్రిగూడ మండలంలోని శివన్నగూడెంలో ఇండ్ల ముందున్న భగీరథ నీటి కుళాయిలు
చేతిపంపే కట్టుగొయ్య: మునుగోడు ప్రాంతంలో మిషన్ భగీరథ వచ్చినంక చేతిపంపులన్నీ బంద్ అయినయ్. కానీ, ఇడికుడ గ్రామంలో ఉన్న ఈ చేతిపంపు ఇంకా ఉపయోగంలో ఉన్నది! ప్రాథమిక పాఠశాల, గ్రామ పంచాయతీ కార్యాలయం పక్కనే ఈ చేతి పంపు ఉన్నది. ఒకప్పుడు ఈ చేతిపంపు నీళ్లే పాఠశాల విద్యార్థులు, స్థానికులు తాగేవాళ్లు. ఇప్పుడు ఎవరూ ఈ పంపు నీళ్లు తాగట్లే. నిరుపయోగంగా ఉన్న ఈ చేతి పంపుకు కోడెను కట్టేసి, దాని ప్లాట్ఫామ్ మీద గడ్డి వేసి రోజూ మేపుకొంటూ చేతిపంపుని ఉపయోగించుకుంటున్నడు ఇడికుడ రైతు!