Hyderabad ORR | ఆదిభట్ల/నల్లగొండ, జూలై 1: హైదరాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్డుపై బుధవారం తెల్లవారుజామున కాల్పులు కలకలం సృష్టించాయి. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ భూష్మి శ్రీకాంత్ హైదరాబాద్లో ఉన్నారనే సమాచారంతో అతన్ని పట్టుకునేందుకు నల్లగొండ సీసీఎస్ పోలీసుల బృందం అక్కడకు వెళ్లింది. ఆదిభట్ల పోలీస్ స్టేషన్ సమీపంలోని బొంగులూరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 12 వద్ద శ్రీకాంత్ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా.. పోలీసులపై తిరగబడి కత్తితో దాడి చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఆత్మరక్షణ కోసం అతనిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నల్లగొండ సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధనగిరి తలకు గాయమైనట్లు సమాచారం.
వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపూర్కు చెందిన భూష్మి శ్రీకాంత్ చిన్న చిన్న దొంగతనాలు చేస్తుండేవాడు. 2007లో అతడిని అరెస్టు చేసే క్రమంలో కానిస్టేబుల్ వేణుబాబును చంపి పారిపోయాడు. అప్పటి నుంచి 120కిపైగా పైగా నేరాలు చేశాడు. ఒక్క నల్లగొండ జిల్లాలోనే అతనిపై సుమారు 300 వరకు కేసులు ఉన్నాయి. దీంతో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ శ్రీకాంత్ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలో భూష్మి శ్రీకాంత్ హైదరాబాద్లో ఉన్నాడనే సమాచారం తెలియడంతో సీసీఎస్ పోలీసుల బృందం వెళ్లింది. బొంగులూరు ఎగ్జిట్ వద్ద శ్రీకాంత్ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో తప్పించుకునేందుకు శ్రీకాంత్ కత్తితో పోలీసులపై దాడికి దిగాడు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. తర్వాత నిందితుడి కాళ్లపై కాల్చారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనలో సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ తలకు గాయమైంది. దీంతో హెడ్ కానిస్టేబుల్ను ఆస్పత్రికి తరలించారు. నిందితుడి తలకు గాయం కావడంతో హైదరాబాద్ వనస్థలిపురంలోని ఆస్పత్రికి తరలించారు.