నల్లగొండ: కాంగ్రెస్ సర్కార్ రైతులకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండలో బీఆర్ఎస్ (BRS) పార్టీ తలపెట్టిన రైతు మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈనెల 21న పట్టణ కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద జరుగనున్న ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. దీనికి సంబంధించి జిల్లా నాయకులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లాలో గ్రామ సభలు, సంక్రాంతి రద్దీ కారణంగా బందోబస్తు ఇవ్వలేమంటూ జిల్లా పోలీసులు ధర్నాకు అనుమతి నిరాకరించారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుమతి కోసం హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్నా నిర్వహించి తీరుతామని స్పష్టం చేస్తున్నారు. గతంలో ఎన్నో నిరసన కార్యక్రమాలు గడియారం సెంటర్లో జరిగాయని గుర్తుచేస్తున్నారు. అప్పుడు లేని అభ్యంతరాలు కొత్తగా ఇప్పుడేంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధర్నాకు అనుమతివ్వకుంటే మంగళవారం నుంచి జరుగనున్న గ్రామసభలనే నిరసన వేదికలుగా మారుస్తామని హెచ్చరిస్తున్నారు.