మునుగోడు: స్వగ్రామానికి రోడ్డు వేసుకోనోళ్లు మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారా అని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన కంటే ముందు నుంచి కోమటిరెడ్డి సోదరులు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీగా పనిచేశారని.. అయితే కనీసం వారి స్వగ్రామమైన కాశివారి గూడానికి రోడ్డు వేయలేని దౌర్భాగ్యులని ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు మండలంలోని కలవలపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవీఎంలలో ఓటు ఎలా వేయాలో అవగాహన కల్పించారు. అనంతరం మాట్లాడుతూ.. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి 1999, 2004లో ఈ ప్రాంత ఎమ్మెల్యేగా గెలిచారని, పునర్విభజన తర్వాత 2009లో రాజగోపాల్ రెడ్డి ఎంపీగా, 2014లో ఎమ్మెల్సీగా, 2018లో ఎమ్మెల్యేగా గెలుపొందాడని వారి సొంత గ్రామానికి ఆనుకొని ఉన్న ఊరుకు రోడ్డు వేయలేకపోయారని విమర్శించారు.
కోమటిరెడ్డి బ్రదర్స్ ఆరాటమంతా కాంట్రాక్టుల కోసమేనని ప్రజల కోసం కాదని విమర్శించారు. రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టుల కోసం బీజేపీలో చేరి.. ఉపఎన్నికకు కారణమయ్యాడని చెప్పారు. ఈ ఎన్నికల్లో కోమటిరెడ్డికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు.