హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన భాషను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టం తీసుకొనిరావాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సూచించారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని శుక్రవారం వీరేశం ప్రవేశపెట్టగా, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి బలపరిచారు. ఈ సందర్భంగా వేముల వీరేశం మాట్లాడుతూ.. కొందరు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, వారి ప్రవర్తనను అదుపుచేసేలా సభలో తీర్మానం ప్రవేశపెట్టి ప్రత్యేక చట్టం రూపొందించాలని కోరారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలుచేసి తీరుతామని, తమకు ప్రజలు ఐదేండ్లు అవకాశమిచ్చారని అంత వరకు ఓపికపట్టాలని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రజల భవిష్యత్ను బంగారుమయం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని యెన్నం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ‘ఇది ఎడ్డి.. గుడ్డి తెలంగాణ కాదు.. కర్రుకాల్చి వాతపెట్టే తెలంగాణ’ అని అభివర్ణించారు. సీఎం మంత్రులకు అధికారాలివ్వాలని, అధికారులు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండాలని ఆకాంక్షించారు. స్కిల్ డెవలప్మెంట్, యువతకు ఉద్యోగాల కల్పనలో భాగంగా రాష్ట్రంలోని 50 ఐటీఐలకు రూ.2 వేల కోట్లతో స్కిల్డెవలప్మెంట్ సెంటర్లుగా మార్చబోతున్నట్టు తెలిపారు. థేమ్స్ నదిలా మూసి నదిని సుందరీకరిస్తామని చెప్పారు.
కొత్తగా అసెంబ్లీ కొలువుదీరిన నేపథ్యంలో సభ్యులు కూర్చోడానికి వీలుగా వారికి సీట్లను కేటాయించారు. సభ్యులంతా తమకు కేటాయించిన సీట్లల్లో కూర్చోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ సభలో ప్రకటన చేశారు.