కేతేపల్లి : బీజేపీ ప్రభుత్వంపై యుద్ధం చేయడానికి రైతులంతా ఏకమవ్వాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పిలుపునిచ్చారు. తెలంగాణ రైతులను ఇబ్బందులు పెడుతున్న మోదీ ప్రభుత్వ తీరుపై రైతులంతా సంఘటితం కావాలని ఆయన చెప్పారు.
నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలో శనివారం ఎమ్మెల్యే లింగయ్య పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరయ్యారు. మొదట తుంగతుర్తి గ్రామంలో 5 లక్షల రూపాయలతో నిర్మించనున్న సిసి రోడ్డు, అలాగే సబ్ మార్కెట్ యార్డ్ లో 10 లక్షల రూపాయలతో నిర్మించనున్న షెడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే లింగయ్య మాట్లాడుతూ.. “ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. రైతులు కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. దేశానికి తిండి పెట్టడంలో అగ్రగామిగా మన తెలంగాణ నిలవడం సీఎం కేసీఆర్ సాధించిన విజయం ” అని ఆయన అన్నారు.
వడ్లు కొనబోమని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్నందునే పంట మార్పిడి అనివార్యమైందని ఎమ్మెల్యే లింగయ్య తెలిపారు. కేంద్రంలో ఒక మాట, రాష్ట్రంలో ఒక మాట చెప్పి తెలంగాణ రైతులను మోసం చేసే బీజేపీ నాయకులకు బుద్ది చెప్పాలి.. దీనికోసం రైతులంతా ఏకమై బీజేపీ ప్రభుత్వంపై యుద్ధం చెయ్యాలి అని ఆయన అన్నారు. సన్నాలు పండిస్తే కోతుల బెడద ఉందని సీఎం గారి దృష్టికి తీసుకెళ్లామని, అవసరమైతే పంటకు రక్షణగా సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు.