RS Praveen Kumar | తన రాజకీయ ప్రస్థానంలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు మిమ్మల్ని బాధపెట్టి ఉండవచ్చని శ్రేయోభిలాషులను ఉద్దేశించి నాగర్కర్నూలు పార్లమెంటు అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. ఒక ఉన్నతమైన లక్ష్య సాధన కోసం కొన్ని త్యాగాలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా.. తన మీద సోషల్మీడియా వేదికగా కొన్ని శక్తులు ( కొంతమంది ఆప్తులతో సహా ) తీవ్రమైన దాడి చేశాయని.. ఇంకా చేస్తూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అనాగరికమైన దాడులు తనకు కొత్త కాదని తెలిపారు. పేద ప్రజల జీవితాలను సమూలంగా మార్చాలన్న లక్ష్యం నుంచి తనను ఈ చిల్లర రాజకీయాలు దూరం చేయలేవని స్పష్టం చేశారు. తన మీద నమ్మకంతో నాగర్కర్నూలు బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించినందుకు కేసీఆర్కు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఇన్నాళ్లూ పీడిత ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేశానని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తెలిపారు. చట్టసభల్లో కూడా మీ గొంతుకగా ఉండాలనే లక్ష్యంతో.. ఎంతో విలువైన ఉద్యోగాన్ని సైతం వదిలి రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. అసెంబ్లీలో బహుజనుల గొంతుకగా ఉండాలని రాత్రింబవళ్లు శ్రమించినా మొదటి ప్రయత్నంలో విఫలమయ్యానని అన్నారు. తెలంగాణ వాదం – బహుజనవాదం రెండూ ఒక్కటేనని నమ్మి ఎంతో శ్రమించి కేసీఆర్, మాయావతిని ఒప్పించి తెలంగాణలో చారిత్రాత్మక పొత్తు ఏర్పాటయ్యేలా చూశానని చెప్పారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది చివరి నిమిషంలో రద్దయ్యిందని అన్నారు. ఇచ్చిన మాట మేరకు విశాల తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, దేశంలో కోట్లాది బహుజనుల బంగారు భవిష్యత్తు కోసం, భారత రాజ్యాంగ విలువల రక్షణ కోసం, కేసీఆర్తోనే కలసి ప్రయాణించాలనుకున్నా అని తెలిపారు. బీజేపీ కుట్రల నుంచే దేశాన్ని రక్షించే దమ్ము-ధైర్యం కాంగ్రెస్కు ముమ్మాటికీ లేదని..అందుకే ఇటీవల బీఆర్ఎస్లో చేరానని స్పష్టం చేశారు.
ఈ యుద్ధంలో కేసీఆర్ మార్గదర్శనంలో సర్వశక్తులొడ్డి విజయం కోసం పోరాడతానని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తెలిపారు. దయచేసి తనతో కలిసి రావాలని.. చేతనైతే సాయం చేయాలని పిలుపునిచ్చారు. ‘ మీ విలువైన సమయం ఇచ్చి.. నాగర్కర్నూలు నియోజకవర్గానికి వచ్చి కారు గుర్తుకు ఓటేయ్యాలని ఇంటింటికీ ప్రచారం చేయండి.. లేదా మీకు తెలిసిన వారందరికీ కనీసం ఫోన్ చేసి అయినా చెప్పండి’ అని కోరారు. తాను చట్టసభల్లో కూర్చుంటే మీరందరూ అక్కడ కూర్చున్నట్టే.. నేను నేను కాదు.. నేను మీరే అని తెలిపారు.