నాగర్కర్నూల్, డిసెంబర్ 12: గుప్తనిధుల ద్వారా రాత్రికి రాత్రే ధనవంతులు కావాలనుకున్న వారే అతని టార్గెట్. తన మంత్రదండకాన్ని ఉపయోగించి అమాయకులు, వితంతువులను చంపడమే అతని లక్ష్యం. తన తాతల నాటి నుంచి కొనసాగుతున్న మూలికావైద్యంతోపాటు క్షుద్రపూజల పేరుతో ఇప్పటి వరకు 11 మందిని పొట్టనపెట్టుకున్నాడు ఓ సీరియల్ కిల్లర్ సత్యనారాయణస్వామి. తనను నమ్మిన వారి నుంచి ప్లాట్లు, భూములు రిజిస్ట్రేషన్ చేయించుకునేవాడు. తన పని ముగిశాక వారిని వశపరుచుకొని ఏకాంతంగా ఉన్న చోటికి పిలిపించుకొని హత్య చేసేవాడు.
పూజలు చేస్తూ తీర్థం పేరుతో వారి నోట్లో యాసిడ్ లేక విష పదార్థాలు పోసి చంపేవాడు. హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి మిస్సింగ్ కేసులో కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు చేపట్టిన దర్యాప్తులో ఈ విషయం వెలుగుచూసింది. నాగర్కర్నూల్ జిల్లా పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి జోగులాంబ గద్వాల డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ ఆధ్వర్యంలో మంగళవారం నాగర్కర్నూల్ ఎస్పీ కార్యాలయంలో మీడియా ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఎల్ఎస్ చౌహాన్ మాట్లాడుతూ.. మాంత్రికుడు రామటి సత్యనారాయణ అలియాస్ సత్యంయాదవ్ అలియాస్ సత్యనారాయణస్వామి నాగర్కర్నూల్ జిల్లాలోనే కాకుండా ఇతర రాష్ర్టాల్లోనూ పలు హత్యలు చేసి అంతర్రాష్ట్ర హంతకుడిగా మారినట్టు వెల్లడించారు.
వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్కు చెందిన బాలికతోపాటు ముగ్గురు వ్యక్తులు, నాగర్కర్నూల్ పీఎస్ పరిధిలో ఇద్దరు, కొల్లాపూర్ పీఎస్ పరిధిలో ఒకరు, కల్వకుర్తి పీఎస్ పరిధిలో ఒకరు, కర్ణాటక రాష్ట్రంలోని బలగనూరు పీఎస్ పరిధిలో ఓ మహిళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా పెద్దవడుగూరు పీఎస్ పరిధిలో ఒకరిని హత్య చేసినట్టు నిందితుడు ఒప్పుకున్నట్టు డీఐజీ వెల్లడించారు. ఇప్పటివరకు తెలుగు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తోపాటు కర్ణాటకలో 8 కేసుల్లో అతని పాత్ర ఉన్నట్టు గుర్తించామని పేర్కొన్నారు. హైదరాబాద్లోని లంగర్హౌస్కు చెందిన గోవుల వెంకటేశ్.. తాను నాగర్కర్నూల్లో రామటి సత్యనారాయణ వద్దకు వెళ్తున్నానని చెప్పి వెళ్లి.. ఐదురోజులైనా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చేపట్టిన విచారణలో సత్యంయాదవ్ గుట్టురట్టయ్యిందని డీఐజీ తెలిపారు. నిందితుడి నుంచి మృతులకు సంబంధించిన 5 సెల్ఫోన్లు, నిందితుడు ఉపయోగించిన 8 సెల్ఫోన్లు, 10 సిమ్కార్డులు, టీఎస్ 31సీ 3689 నెంబర్ గల స్విఫ్ట్ కారు, విషపూరితమైన పదార్థాలు ఉన్న పెట్టెలు, సీసాలు, 5 ఎలక్ట్రికల్ డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నట్టు డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ వివరించారు. మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఐజీ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, అదనపు ఎస్పీ రామేశ్వర్, డీఎస్పీ మోహన్కుమార్, సీఐ విష్ణువర్ధన్రెడ్డి, ఎస్సై మహేందర్ ఉన్నారు.