నాగర్కర్నూల్ : మైనింగ్ ద్వారా నష్టపోయిన ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు మైనింగ్ నిధులను వినియోగించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అధికారులను ఆదేశించారు. నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం జిల్లా ఖనిజ ఫౌండేషన్ ట్రస్ట్ సమావేశం నిర్వహించారు. ట్రస్టుకు మంత్రి అధ్యక్షుడిగా, కలెక్టర్ ఉదయ్కుమార్ సభ్య కార్యదర్శి, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, మండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్, మౌళిక వసతులు, సంక్షేమ శాఖల అధికారులు సభ్యులుగా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ట్రస్టు సమావేశం ఎప్పుడో నిర్వహించాల్సిందని, కరోనా వల్ల నిర్వహించలేకపోయామన్నారు. ఆగస్టు 31 వరకు నాగర్ కర్నూల్ జిల్లాలో మినరల్ ఫండ్ రూ.38.98 కోట్లు జమ అయ్యాయని పేర్కొన్నారు. నిబంధనల మేరకు జిల్లా మినరల్ ఫండ్ నుంచి 5శాతం అంటే రూ.1.94 కోట్లు అత్యవసర పరిస్థితులకై జాతీయ బ్యాంకులో జమ చేయడం జరిగిందన్నారు. మరో ఐదుశాతం పరిపాలన, డైరెక్టర్ మైన్స్ ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. అమ్బుడ్స్ మెన్, ఇతరులకు 5 శాతం రూ. 1.94 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
మిగిలిన 85 శాతం నిధులను మైన్స్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి, సమతౌల్యం గురించి ఖర్చుచేయాల్సి ఉంటుందన్నారు. 15శాతం పోను మిగిలిన 33.14 కోట్ల నిధుల్లో ఇప్పటికే జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో సంబంధిత ఎమ్మెల్యేలు, ఎంపీలు చేసిన సిఫారసుల మేరకు రూ. 23.81 కోట్ల నిధులకు పరిపాలన అనుమతులు జారీ చేసి పనులు పురోగతిలో ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ నిధుల్లో ఎంపీరూ. 3.50కోట్ల నిధులకు, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రూ. 5.56 కోట్లకు, కల్వకుర్తి ఎమ్మెల్యే, రూ. 2.62 కోట్లు, కొల్లాపూర్ ఎమ్మెల్యే రూ.3.49 కోట్లకు సిఫరాసు చేయగా పరిపాలన ఆమోదం పొందినట్లు తెలిపారు.
మిగిలిన రూ. 9.33 కోట్లకు ముందుగా కమిటీలో చర్చించి, ఆమోదం పొందిన తర్వాత పరిపాలన ఉత్తర్వులు జారీ చేయాల్సింటుందన్నారు. సమావేశంలో కలెక్టర్ ఉదయ్ కుమార్, ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, జడ్పీ చైర్మన్ పెద్దపల్లి పద్మావతి, కొల్లాపూర్ శాసన సభ్యులు భీరం హర్షవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, పీడీ డీఆర్డీవో నర్సింగ్ రావు, జిల్లా సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.