హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): బెల్జియంలో అంతర్జాతీయ స్థాయి లైఫ్ సైన్సెస్ క్లస్టర్గా గుర్తింపు పొందిన ఫ్లాండర్స్ రీజియన్తో హైదరాబాద్కు ఎన్నో సారూప్యతలు ఉన్నాయని ఫ్లాండర్స్ రీజియన్ సౌత్ ఇండియా ఇంచార్జి జయంత్ నడిగార్ తెలిపారు. ఫ్లాండర్స్లో మాదిరిగా తెలంగాణలోనూ ఫార్మా రంగ మౌలిక వసతులు ఎంతో అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. బయో ఏషియా సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా ముచ్చటించారు.
దేశంలోని అన్ని రంగాల కంటే తెలంగాణలో ఫార్మా రంగం శరవేగంగా అభివృద్ధి చెందిందని, అంతర్జాతీయ పెట్టుబడులకు ఎంతో అనుకూలమైన మౌలిక వసతులను కలిగి ఉన్నదని చెప్పారు. దీంతో ఇరు ప్రాంతాలకు పెట్టుబడులను ఆకర్షించేందుకు, సాంకేతికతను ఇచ్చిపుచ్చుకునేందుకు కృషి చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగా మంత్రి కేటీఆర్తో ప్రత్యేకంగా సమావేశమై తెలంగాణ సహకార వేదికను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు తెలిపారు. కొవిడ్ సంక్షోభానంతరం ఫార్మా రంగానికి పుష్కళంగా పెట్టుబడులు వస్తున్నాయని, వీటిని అందిపుచ్చుకోగల మౌలిక వసతులు ఉన్న ప్రాంతాలు అభివృద్ధిలో దూసుకుపోతాయని పేర్కొన్నారు. ఇప్పటికే తెలంగాణ లైఫ్ సైన్సెస్, బయోటెక్, మెడిటెక్ రంగాలకు అవసరమైన పటిష్ఠ మౌలిక వసతులను కలిగి ఉండటంతోపాటు అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్య సేవలను అందిస్తూ మెడికల్ హబ్గా గుర్తింపు పొందిందని ప్రశంసించారు.
ప్రపంచంలో ఎంతో అభివృద్ధి చెందిన దేశాలుగా పరిగణిస్తున్న జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాలతో సరిహద్దును కలిగివున్న ఫ్లాండర్స్ ప్రాంతం గ్లోబల్ మార్కెట్లకు అనుకూలంగా ఉన్నదని చెప్పారు. ఇదేవిధంగా విదేశాలతో తెలంగాణ వాణిజ్యాన్ని సాగించేందుకు విమాన మార్గాలు, పోర్టులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీ తరహాలో ఫార్మా రంగానికి అవసరమైన ఆధునిక టెక్నాలజీని ఫ్లాండర్స్ రీజియన్ కలిగి ఉన్నదని, దీంతో ఇరు ప్రాంతాల మధ్య సత్సంబంధాలను మెరుగుపరి వాణి జ్య విస్తరణకు చర్యలు చేపట్టనున్నట్టు చెప్పారు. దీని లో భాగంగా లైఫ్ సైన్సెస్, బయోటెక్, మెడిటెక్ రంగా ల్లో ఉన్న అవకాశాలపై గత మూడు నెలల నుంచి అధ్యయనం చేస్తున్నట్టు జయంత్ నడిగార్ వివరించారు.