హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): దళితబంధు లబ్ధిదారులందరికీ ఎక్విప్మెంట్ ఆపరేటర్ శిక్షణ ఇవ్వాలని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ (న్యాక్) పాలకవర్గం నిర్ణయించింది. జిల్లాల్లోని నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణలు ఇచ్చేందుకు ఉమ్మడి జిల్లాకు ఒకటి చొప్పున న్యాక్ శిక్షణ కేంద్రాలను నిర్మించాలని తీర్మానించింది. హైదరాబాద్లో శనివారం రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధ్యక్షతన జరిగిన న్యాక్ కార్యవర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జిల్లాల్లో నిర్మించే కేంద్రాలు నిరుద్యోగ యువతకు నిర్మాణం, ఐటీ, సేవల రంగాల్లో శిక్షణ తీసుకోవడానికి కేంద్ర శిక్షణా కేంద్రాలుగా మారేవిధంగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. సమావేశంలో ప్రభుత్వ ప్రధా కార్యదర్శి సోమేశ్కుమార్, కార్యదర్శి కేఎస్ శ్రీనివాసరాజు, డైరెక్టర్ జనరల్ కే భిక్షపతి, చీఫ్ ఇంజినీర్ వీ భాసర్రెడ్డి, బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర చైర్మన్, క్రెడాయి మాజీ జాతీయ అధ్యక్షుడు సీ శేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.