హైదరాబాద్, జనవరి 30(నమస్తే తెలంగాణ): 2024-25 సంవత్సరానికి వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.1.33 లక్షల కోట్ల రుణాలు ఇచ్చేందుకు జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (నాబార్డ్) ప్రణాళిక రూపొందించింది. ఇందులో పంటల సాగు రుణాల కోసం రూ.81,478 కోట్లు, టర్మ్లోన్స్కు రూ. 27,664 కోట్లు, మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.5,197.26 కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఫోకస్ పేపర్ పేరుతో నాబార్డ్ ఖరారు చేసిన రుణ ప్రణాళికను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం హైదరాబాద్లో విడుదల చేశారు. అన్ని రంగాలకు కలిపి మొత్తంగా రూ.2.80 కోట్లతో రుణ ప్రణాళికను నాబార్డ్ ఖరారు చేసింది. ఇందులో అత్యధికంగా వ్యవసాయ రంగానికి రూ.1.33 లక్షల కోట్లు, ఎంఎస్ఎంఈలకు రూ.1.29 లక్షల కోట్లు, హౌసింగ్కు రూ.10,768 కోట్లు కేటాయించింది.
గత సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది అన్ని రంగాలకు రుణాలను నాబార్డు పెంచింది. నిరుడు రూ.1.85 లక్షల కోట్లతో రుణ ప్రణాళికను నాబార్డు విడుదల చేసింది. ఈ ఏడాది అంతకంటే సుమారు రూ.94 వేల కోట్లు అదనంగా కేటాయించింది. వ్యవసాయ, అనుబంధరంగాలకు నిరుడు 1.12 లక్షల కోట్లు కేటాయించగా, ఈ ఏడాది 1.33 లక్షల కోట్లకు పెంచింది. ఇది గత సంవత్సరం కంటే దాదాపు రూ.20,825 కోట్లు అధికం.
తన జీవితంలో నాబార్డుకు ప్రత్యేక స్థానం ఉన్నదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఫోకస్ పేపర్ విడుదల అనంతరం ఆయన మాట్లాడుతూ.. తన రాజకీయ, వ్యక్తిగత జీవితంలో ఎదుగుదలకు ఈ సంస్థ ఎంతగానో ఉపయోగపడిందని గుర్తు చేసుకున్నారు. నాబార్డు వద్ద తీసుకున్న రుణం డబ్బులతోనే 1983లో తొలిసారిగా ఎమ్మెల్యేగా నామినేషన్ వేశానని తెలిపారు. వ్యవసాయరంగానికి వీలైనంత ఎక్కువగా రుణాలిచ్చి ఈ రంగం అభివృద్ధికి శక్తిమేర సాయం చేయాలని నాబార్డు అధికారులను కోరారు. ఆయిల్పాం సాగు కోసం రుణాలు ఇవ్వాలని, ఇతర రాష్ర్టాల్లో మాదిరిగా డెయిరీ రైతులకు వ్యక్తిగతంగా రుణాలు మంజూరుపై దృష్టి పెట్టాలని సూచించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు సేవలను మంత్రి కొనియాడారు. ఖమ్మం కలెక్టర్గా పనిచేసిన సమయంలో రఘునందన్రావును చాలా కష్టపెట్టానని, అప్పుడు ఇద్దరం కష్టపడి ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేశామని వివరించారు. ఇప్పుడు వ్యవసాయరంగాన్ని కూడా మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.
వచ్చే ఏడాది కొత్త క్రాప్ ఇన్సూరెన్స్ను తీసుకొస్తున్నట్టు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు తెలిపారు. రైతులకు అన్ని రకాలుగా మేలు జరిగే విధంగా దీనిని రూపొందిస్తామని భరోసా ఇచ్చారు. రైతుబంధు నిధులను కూడా పెంచబోతున్నట్టు తెలిపారు. రైతువేదికలను మరింతగా రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అన్ని రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నాబార్డు తరుపున అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నామని, పలు ప్రతిష్ఠాత్మక పథకాలకు రుణాలు ఇస్తున్నామని నాబార్డ్ సీజీఎం సుశీల చింతల తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఎల్బీసీ కన్వీనర్ దేబాశీష్మిత్ర తదితరులు పాల్గొన్నారు.