హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ)/శ్రీరాంపూర్: సింగరేణిని దేశంలో అగ్రగామి సంస్థగా నిలపడానికి కృషిచేస్తామని సింగరేణి నూతన సీఎండీ ఎన్ బలరాం చెప్పారు. కొత్త గనులను ప్రారంభించుకోవడంతోపాటు థర్మల్, సోలార్ విద్యుత్తును మరింతగా విస్తరింపజేస్తామని తెలిపారు. నూతన సీఎండీగా ఆయన బుధవారం సింగరేణిభవన్లో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తనకు ఈ అవకాశం కల్పించిన ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, ఇంధనశాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు సింగరేణిని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. కార్మిక సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెప్పారు. రక్షణ పట్ల మరింత శ్రద్ధ వహిస్తూ ఖర్చుకు వెనుకాడకుండా చర్యలు తీసుకోనున్నామని పేర్కొన్నారు. సింగరేణిలో ఖాళీ పోస్టులను గుర్తించి భర్తీ చేస్తామని చెప్పారు. సింగరేణి ఈ ఏడాది 700 లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించాలంటే అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు యాజమాన్యానికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా సీఎండీకి పలువురు అధికారులు అభినందనలు తెలిపారు. సింగరేణి మాజీ డైరెక్టర్ పవిత్రన్కుమార్, ఉత్తరప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి శ్రీనివాస్, సెంట్రల్ కోల్ఫీల్డ్స్ చైర్మన్, కోల్ ఇండియా డైరెక్టర్ (టెక్నికల్) బీ వీరారెడ్డి, సింగరేణి డైరెక్టర్లు ఎన్వీకే శ్రీనివాస్, జీ వెంకటేశ్వరరెడ్డి, ఈడీ జే ఆల్విన్, జీఎంలు సురేశ్, గురవయ్య, సింగరేణి అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్వీ రాజశేఖరరావు, అధికారులు, ఉద్యోగులు సీఎండీని కలిసి అభినందనలు తెలిపారు.