Mynampally Rohith | రామాయంపేట, నవంబర్ 3: మెదక్ జిల్లా రామాయంపేటలో హరిజనకాలనీలో మైనంపల్లి రోహిత్ను దళితులు అడ్డుకున్నారు. శుక్రవారం ప్రచారం కోసం ఆయన కాలనీకి రాగా, కాలనీలోకి రాకుండా బైకులు అడ్డం పెట్టారు. ‘కాంగ్రెస్ నాయకులు మా కాలనీకి రావద్దు.. బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి జిందాబాద్.. జై తెలంగాణ.. జైజై తెలంగాణ’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రోహిత్ వర్గీయులు బైక్లను తొలగించి కాలనీలోకి వచ్చారు. దీంతో తమ కాలనీకి ఎందుకు వచ్చారని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు.
దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. అక్కడే ఉన్న రోహిత్ మైకు తీసుకుని తాము రామాయంపేటను అభివృద్ధి చేయడానికి వచ్చామే తప్ప మరేమి లేదని వివరణ ఇచ్చారు. రామాయంపేటలో పదేండ్లుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదనటంతో కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ అభివృద్ధి జరగలేదో చూపించాలని రోహిత్ను ప్రశ్నించారు. దీంతో కాంగ్రెస్ సీనియర్ నేత కల్పించుకొని, రోహిత్ను సముదాయించి అక్కడి నుంచి పక్క కాలనీకి తీసుకెళ్లారు. అక్కడ కూడా రోహిత్ మాట్లాడుతుండగా, ‘జై తెలంగాణ.. జై పద్మక్క’ నినాదాలు హోరెత్తడంతో చేసేదేమి లేక రోహిత్ నడుచుకుంటూ కాలనీవాసులకు దండం పెడుతూ వెళ్లిపోయారు.